రాజధాని ఎక్స్ ప్రెస్కు బాంబు బెదిరింపు: 4 గంటలు ఆలస్యం
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపుతో జమ్మూ నుంచి ఢిల్లీకి రావాల్సిన రాజధాని ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ అధికారులు పంజాబ్ పోలీసులకు సమాచారం అందిచ్చారు.
దీంతో రాజధాని ఎక్స్ప్రెస్ను ఆర్మీ, పోలీసు అధికారులు పంజాబ్లోని పఠాన్ కోట్లో నిలిపివేశారు. అనంతరం రైలును నిలిపివేసి నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రాజధాని ఎక్స్ ప్రెస్లో ఎలాంటి బాంబు లభించలేదని తెలిపారు.
రైల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ, పోలీసు అధికారుల తనిఖీల అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా రాజధాని ఎక్స్ప్రెస్ తిరిగి పయనమైంది. పఠాన్ కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడంతో, భద్రతా సిబ్బంది నిఘా పెంచారు.