కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత: ఐదుగురు హతం
Recommended Video
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి పోషియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు.
దీంతో శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఐదుకు చేరింది. శుక్రవారం రాత్రి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. షోపియాన్లోని కిల్లోరా ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు ముష్కరులు మృతి చెందినట్లు సైనికాధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఆప్రాంతంలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. అయితే ముష్కరులు కాల్పులకు దిగడంతో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
4 more bodies of terrorists visible at encounter site kiloora Shopian taking the total to 5 terrorists killed. Good Job boys , good for peace.
— Shesh Paul Vaid (@spvaid) August 4, 2018
శుక్రవారం రాత్రి మట్టుబెట్టిన ఉగ్రవాదిని లష్కరే తోయిబాకు చెందిన ఉమర్మాలిక్గా గుర్తించారు. ఘటనాస్థలిలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలను రాష్ట్ర డీజీపీ అభినందించారు.
ఇది ఇలా ఉంటే, ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలిసిన వేర్పాటువాదులు భద్రతా దళాలపై రాళ్లు విసురుతూ ఆందోళనలు చేపట్టారు. భద్రతా దళాల వాహనాలపై అల్లరి మూకలు పెట్రో బాంబులు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.