జవాన్లే లక్ష్యంగా పేట్రేగిన ఉగ్రవాదులు: మళ్లీ అక్కడే: అదే తరహా మారణకాండ కోసం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. సాయుధ బలగాలు, జవాన్లను లక్ష్యంగా చేసుకుని మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన టిప్పర్లో ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలిపోయింది. ఈ ఘటనలో టిప్పర్ సహా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రాణాపాయం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం లేదు. ఒకరిద్దరు గాయపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
పుల్వామా మారణకాండకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి అలాంటి ఘటనకు పాల్పడటానికి ఉగ్రవాదులు చేస్తోన్న ప్రయత్నాలు వరుసగా భగ్నమౌతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఎనిమిదిన్నర కిలోల ఐఈడీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాల మధ్య టిప్పర్లో ఉంచిన ఐఈడీ పేలడంతో కలకలం చెలరేగింది. పుల్వామా జిల్లాలోని అవంతిపుర జాతీయ రహదారిపై రెండేళ్ల కిందట ఉగ్రవాదులు భారీ స్థాయిలో పేలుడుకు పాల్పడిన ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
తాజాగా- బిజిబెహెరా పట్టణంలోని పాజల్పొర ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ఓ టిప్పర్లో పేలుడు సంభవించింది. దీని తీవ్రతకు టిప్పర్ ధ్వంసమైంది. దానికి ఆనుకుని పార్క్ చేసి ఉంచిన కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. పాజల్పొర..జనసమ్మర్థం ఉండే ప్రాంతం. పేలుడు చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో రద్దీ నెలకొని ఉంది. అయినప్పటికీ- ఈ పేలుడు వల్ల ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. కొందరు స్థానికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ఐఈడీ తీవ్రత ప్రభావం భారీగా లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. అతి తక్కువ పరిణామంలో ఉన్న ఐఈడీని అమర్చి ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. దెబ్బతిన్న టిప్పర్ను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోన్నప్పటికీ..వారి ఉనికి, జిహాదీలు ఇంకా క్రియాశీలకంగా ఉన్నారనడానికి ఈ పేలుడును ఉదాహరణగా చెబుతున్నారు.