జమ్ముకశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో టెలీ కమ్యూనికేషన్ సేవలు పునరుద్దరించే చర్యలు మొదలయ్యాయి. ఆ క్రమంలో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ కనెక్షన్లు త్వరలో ఇవ్వడానికి సిద్దమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉంది. జమ్ముకశ్మీర్లో త్వరలోనే పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులు పునరుద్దరించడానికి చర్యలు తీసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. రెండు మూడు రోజుల్లో సర్వీసులు ప్రారంభించే అవకాశముందని.. ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తితే కాస్తా ఆలస్యమయ్యే అవకాశముందని వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన ఇక్కడ టెలీ కమ్యూనికేషన్ సేవలు నిలిపి వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. అల్లరి మూకలు చెలరేగి పోకుండా ఫోన్ కనెక్షన్లతో పాటు ఇంటర్నెట్ సేవలకు కూడా బ్రేక్ పడింది. తదనంతరం క్రమక్రమంగా ల్యాండ్ ఫోన్ సేవలు పునరుద్ధరించే చర్యలు తీసుకున్నారు. కుప్వారా జిల్లాలో ఎయిర్ టెల్ సంస్థ ఇన్కమింగ్ సేవలు తిరిగి ప్రారంభించింది. అయితే గత రెండు నెలలుగా కమ్యూనికేషన్ సేవలు లేక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ పూజారి ఢిఫరెంట్.. ఆశీర్వాదం ఎలా ఇస్తాడో తెలుసా..! (VIDEO)
ఈ నేపథ్యంలో 60 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ కనెక్షన్లు కలిగి ఉన్న జమ్ముకశ్మీర్లో దాదాపు 80 వేలకు పైగా బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే అందులో 5 వేలకు పైగా కనెక్షన్లు వివిధ ప్రభుత్వ అధికారులు, పోలీసులు వినియోగిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోన్ కనెక్షన్లు ఇదివరకే పునరుద్ధరించారు. అయితే సాధారణ కస్టమర్లకు మాత్రం ఒకటి రెండు రోజుల్లో పోస్ట్ పెయిడ్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.