జమ్మూ కశ్మీర్ మాజీ ఐఏఎస్ అధికారిపై పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద కేసు నమోదు
జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ మాజీ ఐఏఎస్ అధికారి జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధ్యక్షుడు షా ఫసల్ పై పబ్లిక్ సేఫ్టే చట్టం కింద కేసు నమోదైంది. పబ్లిక్ సేఫ్టీ చట్టంను ఉల్లంఘించినందుకు పలువురిపై కేసులు నమోదు కాగా అందులో మాజీ ఐఎఎస్ అధికారి ఫసల్ పై కూడా కేసు నమోదైంది. ఇక ఇదే చట్టంను ఉల్లంఘించారని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అలీ మొహ్మద్ సాగర్ సర్తాజ్ మదాని, హిలాల్ లోన్, నయీప్ అక్తర్లపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.
గతేడాది ఆగష్టు 14 నుంచి ఫసల్ ప్రివెంటివ్ కస్టడీలో ఉన్నారు. అతన్ని నిర్బంధించిన పోలీసులు అక్కడి నుంచి శ్రీనగర్లోని ఎమ్మెల్యే హాస్టల్కు తరలించారు. ఇక అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. అయితే ఫసల్ను విడుదల చేసి ఇంటికి పంపుతారా లేక ఎమ్మెల్యే హాస్టల్ దగ్గర ఉన్న సబ్ జైలుకు తరలిస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద తన సోదరుడు అయిన ఒమర్ అబ్దుల్లాను అరెస్టు చేసి గృహనిర్భంధంలో ఉంచడం తగదని విడుదలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సారా అబ్దుల్లా పైలట్. కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జమ్మూకశ్మీర్ పాలనా విభాగంను వివరణ కోరింది.
దేశంలోని ఇతర పౌరులకు ఎలాగైతే అన్ని హక్కులు ఉన్నాయో కశ్మీరీలకు కూడా అవే హక్కులు ఉండాలని ఒమర్ అబ్దుల్లా సోదరి సారా అబ్దుల్లా చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి ఒమర్ అబ్దుల్లాతో పాటు మరికొందరిని గృహనిర్బంధం కింద ఉంచారని సారా తరపును వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇక గతేడాది ఆగష్టు 14 నుంచి ఆయన గృహనిర్బంధంలోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇది హేబియస్ కార్పస్ పిటిషన్ అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్.
హేబియస్ కార్పస్ అనేది రిట్ పిటిషన్. ఈ పిటిషన్ వేస్తే వ్యక్తిని కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని అన్యాయంగా గృహనిర్బంధంలో ఉంచితే అలాంటి వారిని కోర్టు ముందు హాజరుపర్చాలని హేబియస్ కార్పస్ పిటిషన్ తెలుపుతోంది.