జమ్ము ప్రశాంతం, మత పెద్దలతో చర్చలు సఫలం
జమ్ము: నేతల పోస్టర్లు తొలగించడం, సిక్కు యువకుడి పై పోలీసులు కాల్పులు జరపడంతో నాలుగు రోజుల నుండి జమ్ము అట్టుడికి పోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి, సిక్కు మతస్తులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులు హడలిపోయారు.
శనివారం ఉదయం సిక్కు మత పెద్దలతో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు చర్చలు జరిపారు, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలు సఫలం కావడంతో జమ్ము, పూంచ్, రాజౌరీ, కథువా, సాంబా జిల్లాలలో సిక్కు మతస్తులు ఆందోళన విరమించారు.
ఆందోళనలకు కారణం అయిన ఖలిస్తాన్ నేత బింద్రన్ వాలే పోస్టర్లు తొలగించిన వ్యక్తులను అరెస్టు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ఆర్ కే గోయల్, కాశ్మీర్ డీజీపీ కే రాజేంద్ర కుమార్ స్వయంగా హామి ఇచ్చారు. అదే విదంగా సిక్కు యువకుడి మీద కాల్పులు జరిపిన పోలీసుల మీద చర్యలు తీసుకుంటామని అన్నారు.
చర్చల సందర్బంగా పోలీసు అధికారులు హామీలు ఇచ్చారని అందువలన ఆందోళన విరమిస్తున్నామని సిక్కుల నాయకుడు తర్ లోచన్ సింగ్ మీడియాకు చెప్పారు. తమ డిమాండ్ లు తీర్చకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల దగ్గర నుండి సిక్కులు లాక్కోన్న ఏకే-47 ఆయుధాన్ని పోలీసు అధికారులు స్వాదీనం చేసుకున్నారు. అయితే ముందు జాగ్రత చర్యగా జమ్ము లోని అన్ని జిల్లాలలో శనివారం కూడ అన్ని విద్యాసంస్థలను మూసి వెయ్యాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.