జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం: చైనాకు చెప్పిన భారత్
జమ్ము కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని దీనిపై ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని భారత విదేశాంగ శాఖ పలు దేశాలకు సూచనలు చేసింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా దేశాలకు సూచనలు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్ము కశ్మీర్ను విభజించడం అనే అంశాలు పూర్తిగా భారత అంతర్గత అంశాలని సుపరిపాలన, ఆర్థికాభివృద్ధి కోసమే ఇది చేయాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ ఇతర దేశాల దౌత్యాధికారులకు తెలిపింది.
జమ్మూ కశ్మీర్ అంశం గురించి భారత్లోని పలుదేశాల దౌత్యాధికారులు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునే క్రమంలో అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది. పార్లమెంటులో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు ప్రవేశ పెట్టామని దానిపై చర్చ జరుగుతోందని చెప్పిన విదేశాంగ శాఖ... ఆ తర్వాత పాస్ చేయడం వంటివి పూర్తిగా అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. మంచి పాలన, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.
సోమవారం రోజున రాజ్యసభలో ముందుగా ఆర్టికల్ 370 రద్దు చేస్తూ అమిత్ షా తీర్మానం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కొన్ని పార్టీలు వ్యతిరేకించగా మెజార్టీ పార్టీలు మాత్రం ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. బీజేపీ అంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే బీఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ మద్దతు తెలిపాయి. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 125 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటువేయగా.. 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది.
ఇక సోమవారమే ఆర్టికల్ 370 రద్దు తీర్మానంను లోక్సభలో ప్రతిపాదించారు అమిత్ షా. మంగళవారం జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లులో ఏ ముందో కూడా చెప్పకుండా చర్చించమంటే ఎలా చర్చిస్తామని ధ్వజమెత్తారు. బిల్లు ప్రవేశ పెట్టడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. అంతేకాదు జమ్ము కశ్మీర్ ప్రజలు భారత్పై పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ సర్కార్ వమ్ము చేసిందని కాంగ్రెస్ మండిపడింది.