జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు: బీజేపీకి షాక్..మెజార్టీ స్థానాల్లో ఇండిపెండెంట్ల విజయం
జమ్మూకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు జరిగిన రెండు నెలలకు జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 280 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 81 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. ఇక ఇండిపెండెంట్లు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన అతిపెద్ద పార్టీ ఒక్క బీజేపీనే కావడం విశేషం. ఎన్సీ, పీపీడీ, కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధంలో ఉంచడంతో ఇందుకు నిరసనగా ఈ పార్టీలు పోటీ చేయలేదు.
బీజేపీకి పట్టున్న జమ్మూలో మూడింట ఒకవంతు సీట్లు గెలిచింది. మొత్తం 148 స్థానాలు జమ్మూలో ఉండగా బీజేపీ 52 స్థానాల్లో విజయం సాధించింది. ప్యాంథర్స్ పార్టీ 8 స్థానాలు గెలువగా మిగతా 88 బ్లాకుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఛెర్మెన్లుగా విజయం సాధించారు. కశ్మీర్ లోయలో బీజేపీ 137 స్థానాల్లో 18 మాత్రమే గెలువగలిగింది. జమ్మూకశ్మీర్లో మొత్తం 316 బ్లాకులకు గాను 307 బ్లాకులకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ 27 మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 280 బ్లాకులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించడం జరిగిందని జమ్మూ కశ్మీర్ చీఫ్ ఎలక్షన్ అధికారి తెలిపారు. బీజేపీ 81 బ్లాకుల్లో గెలువగా కాంగ్రెస్ ఒకచోట, జేకేఎన్పీపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 217 స్థానాల్లో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
ఇక ఓటు వేసేందుకు గాను సర్పంచులను, ఎన్నికల అధికారులను పోలింగ్ స్టేషన్ వద్దకు బుల్లెట్ ప్రూఫ్ మొబైల్ పోలీస్ బంకర్ వాహనాల్లో తీసుకొచ్చారు. దాదాపు 26వేల మంది వార్డుమెంబర్లు, సర్పంచులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని సీఈఓ తెలిపారు. 98శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కకాపోరాలోని ఓ పంచాయతీ కార్యాలయంలో 100 మంది పోలీసులు పహారాగా ఉన్నారు. తొలి గంటన్నర సమయంలో మొత్తం 9 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో రెండు కుటుంబాలకు చెందిన 8మంది కశ్మీరీ పండిట్లు ఉన్నారు.
హర్యానా రసకందాయం: ఇద్దరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి బీజేపీ ఎంపీ.. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా..
ఉత్తరకశ్మీర్లోని సంబల్ బ్లాక్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగారు. ఒకరు బీజేపీ మరోనలుగురు ఇండిపెండెంట్లు. బీజేపీ టికెట్ పై పోటీచేసిందుకు నలుగురు విముఖత చూపగా వారిని ఇండిపెండెంట్లుగా పోటీచేయించి మద్దతు ఇచ్చామని బీజేపీ నేత ఒకరు చెప్పారు. జమ్మూ జిల్లాలో 20 బ్లాకులు ఉన్నాయి. ఇవన్నా 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కింద ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. స్థానిక సంస్థల్లో ఇక్కడ 9 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినట్లుగా ఈసీ ప్రకటించింది. ఇక 19 బ్లాకులున్న కటువాలో 9 బీజేపీ గెలువగా 10 బ్లాకులను ఇండిపెండెంట్లు గెలిచారు. రాజౌలీ జిల్లాలో 19 బ్లాకుల్లో పోటీచేయగా బీజేపీ 8 బ్లాకుల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక పూంఛ్ జిల్లాలో పార్టీ ఖాతా తెరవలేదు.