బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడి
శ్రీనగర్: బీఫ్ పార్టీ ఇచ్చారని ఓ శాసన సభ్యుడిని సాటి శాసన సభ్యులు అసెంబ్లీలో చితకబాదేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుల సమక్షంలోనే దాడి చేశారు. అసెంబ్లీ లోనే శాసన సభ్యుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు.
జమ్మూ కాశ్మీర్ లో గోమాంసం నిషేదిస్తు అసెంబ్లీలో తీర్మాణం చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ బీఫ్ పార్టీ ఎర్పాటు చేశారు. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్ లో బుధవారం బీఫ్ పార్టీ ఇచ్చారు.
బీఫ్ ను నిషేదిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను లెక్కచెయ్యనని రషీద్ చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై చర్చ జరిగింది. సభలో ఉన్న బీజేపీ ఎంఎల్ఏలు గగన్ భగత్, రాజీవ్ శర్మ, రవీందర్ లు కలిసి రషీద్ పై దాడి చేశారు.
స్పీకర్ కవీందర్ గుప్తా ఎదుటే రషీద్ ను చితకబాదేశారు. ఆ సందర్బంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన శాసన సభ్యులు రషీద్ ను కాపాడారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.
అసెంబ్లీలో ఓ ఎంఎల్ఏపై సాటి సభ్యులు దాడి చెయ్యడం దురదృష్టకరం అన్నారు. బీజేపీ శాసన సభ్యుల తీరును జమ్మూ - కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ ఖండించారు. అయితే బీజేపీ శాసన సభ్యులు మాత్రం రషీద్ పై దాడిని సమర్థించుకున్నారు.