కాశ్మీర్ వేర్పాటువాద మహిళా నేత ఆంద్రబీ అరెస్టు
కాశ్మీర్: వేర్పాటు వాద మహిళా నేత ఆసియా ఆంద్రబీని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈమె పాకిస్థాన్ జెండాలను ఎగరవేసి భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడం, ఉగ్రవాద నేత హఫీజ్ సయిూద్ తో కలిసి ర్యాలీలో పాల్గొంది.
ఇటివల పాకిస్థాన్ లో నిర్వహించిన ఓ కాన్పరెన్స్ లో ఫోన్ ద్వారా మాట్లాడటంవంటి పలు ఆరోపణలు ఈమె మీద ఉడటంతో శ్రీనగర్ లోని రామ్ బాగ్ లోని ఇంటిలో ఆంద్రబీని పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా భారత స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు ఆసియా ఆంద్రబీ వివాదాస్పద చర్యలకు దిగింది.
కాశ్మీర్ లోని పలు గ్రామాలలో పాకిస్థాన్ జెండాలు చేత పట్టుకుని పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఆదేశానికి మద్దతుగా నినాదాలు చేసింది. అదే రోజు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయిూద్ నేతృత్వంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొంది.
ఆ ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆంద్రబీ మీద పలు కేసులు నమోదు అయ్యాయి. ఆంద్రబీ దక్తరన్ ఈ మిల్లర్ (డాటర్స్ ఆఫ్ ది ఫెయిత్) చీఫ్ గా పని చేస్తున్నది.
ఆంద్రబీని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను శ్రీనగర్ లోని రామ్ బాగ్ జైలుకు తరలించారు. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఇటివల జరిగిన కాల్పులలో ముగ్గురు సామాన్య పౌరులు మరణించారు. అందుకు నిరసనగా శుక్రవారం ఆందోళన నిర్వహించాలని ఈమె పిలుపునిచ్చారు.
ఆందోళన ర్యాలీలో ప్రజలను రెచ్చగొట్టడానికి సిద్దం అయిన ఆంద్రబీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈమె అరెస్టుతో నిరసనలు వ్యక్తం కాకుండ, నిరసనల ర్యాలీలు జరగకుండా చూడటానికి పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు.