జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం 2019: కేంద్రం చేతిలో ఆ రెండు అధికారాలు
గురువారం అర్థరాత్రి నుంచి జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించింది. జమ్మూకశ్మీర్ మాత్రం కేంద్రం చేతిలోనే పనిచేయనుంది. అంటే ఇక్కడి పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంటుండగా భూభాగం మాత్రం అక్కడి స్థానిక ప్రభుత్వాల కిందే వస్తాయి. జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్టం 2019 ప్రకారం భూమిపై సర్వహక్కులు అక్కడ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కానీ ఢిల్లీలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తాయి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా లెఫ్ట్నెంట్ గవర్నర్ నియంత్రణలో ఉంటాయి.
చట్టాలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వానికి హక్కు
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో చట్టాలు చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీకి అన్ని హక్కులు ఉన్నాయని చెబుతూ రెండింటిని మాత్రం కేంద్రం తనవద్దే అట్టిపెట్టుకుంది. పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలు మాత్రం కేంద్రం పరిధిలోకే వస్తుందని చట్టంలో ఉంది. అదే ఢిల్లీలో పుదుచ్చేరిలలో కూడా సొంత అసెంబ్లీలు ఉండగా పోలీస్, లా అండ్ ఆర్డర్లు మాత్రం లెఫ్ట్నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఇక ఆలిండియా సర్వీసెస్ కింద వచ్చే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఏసీబీలు లెఫ్ట్నెంట్ గవర్నర్ కింద పనిచేస్తారని ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల కింద కాదని చట్టం స్పష్టం చేస్తోంది. ఆలిండియా సర్వీసులు, ఏసీబీలు కేంద్రం నియంత్రణలో ఉండటంతో పలుమార్లు ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ లోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ల మధ్య విబేధాలు తలెత్తాయి.
భూమికి సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రపరిధిలోనే..
ఇక జమ్మూ కశ్మీర్లో భూమి కొనాలన్నా, భూమి అమ్మాలన్నా, లేద భూమి మరొకరి పేరుపై బదిలీ చేయాలన్నా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్నా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కిందకే వస్తాయని జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం పేర్కొంటోంది. ఇక ల్యాండ్ రెవిన్యూ, భూమి సంబంధిత అంశాలు ఏవైనా సరే అవి స్థానిక ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటాయని చట్టంలో పొందుపర్చారు. ఇక మరో కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో పోలీస్, లా అండ్ ఆర్డర్, భూమిపై నియంత్రణ మొత్తం లెఫ్ట్నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం పర్యవేక్షిస్తుంది. అయితే చట్ట ప్రకారం లడఖ్కు అసెంబ్లీ ఉండబోదని చట్టంలో స్పష్టం చేశారు.
లడఖ్లో అసెంబ్లీ ఉండదు..పాలన లెఫ్ట్నెంట్ గవర్నర్ కిందే..
ఇక జమ్మూకశ్మీర్ లడఖ్లు కేంద్రపాలిత ప్రాంతంగా అక్టోబర్ 31న అవతరించినప్పటినుంచి రెండు ప్రాంతాలకు జమ్మూకశ్మీర్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా వ్యవహరించనుంది. గురువారం నుంచి హైకోర్టు జడ్జిలే రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జడ్జీలుగా వ్యవహరిస్తారు. ఇక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం ఉన్న క్యాడర్లలోనే పనిచేయాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో ఇక్కడ పోస్టింగులు తీసుకునే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆగ్మట్ క్యాడర్ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాంలలా యూటీ క్యాడర్ వర్తిస్తుంది. ఇక ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ స్థానాలు 107 ఉండగా డీలిమిటేషన్ తర్వాత 114కు చేరుకుంటుంది. అయితే 24 సీట్లు పీఓకే ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాటిని అలానే ఖాళీగా ఉంచనున్నారు.