ఆర్టికల్ 370 రద్దుపై భగ్గుమన్న విపక్షాలు.. భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్న ముఫ్తీ
Recommended Video
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్ర విషయంలో చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. జమ్ము కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ఇప్పటి వరకున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు అమిత్ షా. అయితే దీనిపై రాజ్యసభలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. ప్రజాస్వామ్యంను బీజేపీ సర్కార్ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్.
సంచలనం..ఆర్టికల్ 370 రద్దు: ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయిన జుమ్ము కాశ్మీర్
ఇదిలా ఉంటే జమ్ము కశ్మీర్ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో ఆగష్టు 5 ఓ చీకటి రోజుగా అభివర్ణించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం అన్యాయమన్న ముఫ్తీ... రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీన్ని రద్దు చేయడం ద్వారా జమ్ము కశ్మీర్ను బయట వ్యక్తులు ఆక్రమించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే జమ్ము కశ్మీర్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును నిరసిస్తూ పీడీపీ ఎంపీలు మీర్ ఫయాజ్, నజీర్ అహ్మద్లు సభలో రాజ్యాంగం కలిగిఉన్న పుస్తకాన్ని చించివేసి నిరసన తెలిపారు. సభ్యులు ఇలా ప్రవర్తించడంపై ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ తప్పారంటూ వారిని వెంటనే సభ నుంచి బయటకు పంపాలని మార్షల్స్ను ఆదేశించారు. మరోవైపు పార్లమెంటులో పీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కింద కూర్చుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.
Today marks the darkest day in Indian democracy. Decision of J&K leadership to reject 2 nation theory in 1947 & align with India has backfired. Unilateral decision of GOI to scrap Article 370 is illegal & unconstitutional which will make India an occupational force in J&K.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019
మరోవైపు జమ్ము కశ్మీర్ అంతా భద్రతాదళాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా తుపాకులతో కవాతు చేస్తున్న సైన్యం కనిపిస్తోంది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ ఏమైనా అలజడులు జరిగే అవకాశం ఉంటుందని కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేసింది. అయితే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రతిపాదన చేయగానే కశ్మీరి పండిట్లు సంబురాలు చేసుకోవడం కనిపించింది. అయితే సభలో మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు పార్టీలకు చెందిన ఎంపీలు సభలో నిరసనలు తెలిపారు. ఆ తర్వాత పార్లమెంటులో కింద కూర్చుని ధర్నాకు దిగారు.