ఈవ్టీజర్ల వేధింపులతో బస్సు నుంచి దూకిన అమ్మాయిలు
జంషెడ్పూర్: ఈవ్ టీజర్ల నుంచి తప్పించుకునేందుకు ముగ్గురు విద్యార్థినులు కదులుతున్న బస్సులోంచి దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్లో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు సక్చి బస్స్టాప్ వద్ద బస్సు ఎక్కారు. అప్పటికే బస్సులో ఉన్న పోకిరీలు విద్యార్థినులను వేధించడం మొదలు పెట్టారు. దీంతో బస్సు ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్ను విద్యార్థులు కోరారు.
అయితే పోకిరీలు వారి స్నేహితులే కావడంతో బస్సు ఆపకుండా పోనిచ్చాడు డ్రైవర్. దీంతో ఈవ్ టీజర్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ముగ్గురు విద్యార్థులు నడుస్తున్న బస్ నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
గమనించిన స్థానికులు గాయపడిన విద్యార్థిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీల్లో ఇద్దరితో పాటు బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని బస్ను సీజ్ చేసినట్లు ఎస్ఎస్పీ అనూప్ మాథ్యూ తెలిపారు.