బ్రిటీష్ గుర్తు: ‘జాతీయ గీతంగా ‘జనగణమన’ వద్దు’
అలీగఢ్: మన దేశ జాతీయ గీతం ‘జనగణమన' ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదని, దాని బదులు ‘వందేమాతరం' లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా' గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలని ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ అభిపాయ్రపడ్డారు.
పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 92ఏళ్ల ఈ కవి పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్.. 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు.' అని తెలిపారు.
‘బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది (ఇంగ్లీష్కు) బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు' అని నీరజ్ అన్నారు. ‘వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు.
జనగణమన గీతంలో ‘అధినాయక' అంటే నియంత. ‘జయహే భారత భాగ్య విధాత' అంటే.. దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..'లో సింధ్ ఇప్పుడు భారతలో ఉందా?' అని ఆయన ప్రశ్నించారు.
అందువల్ల జనగణమన గీతానికి బదులు వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, అది తన రచనలను చూస్తే తెలుస్తుందని అన్నారు. తన రచనలు, కవితలు మానవత్వానికి సంబంధించినవిగా ఉంటాయని తెలిపారు.