రూ. 150 కోట్ల లంచం కేసు, సిట్ కు పత్రాలు, పెన్ డ్రైవ్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, ఏముంది ?
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామికి వ్యతిరేకంగా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు అవసరమైన పత్రాలు మొత్తం ఇచ్చానని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బాంబు పేల్చారు.
మంగళవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) కార్యాలయం నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనేక సాక్షాలతో పాటు అధికారులకు తాను ఓ పెన్ డ్రైవ్ ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.
జంతకల్ మైనింగ్ కంపెనీకి సంబంధించి ఎస్ఐటీ అధికారులకు తాను బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇంతకు ముందు ఈ కేసుకు సంబంధించి విచారణ సవ్యంగా జరగలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
కీలక సాక్షాలు నాశనం అవుతాయనే భయంతోనే తాను గతంలో వాటిని అధికారులకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తన దగ్గర ఉన్న సాక్షాలు మొత్తం ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. జంతకల్ మైనింగ్ కంపెనీ నుంచి మాజీ సీఎం కుమారస్వామి తదితరులు రూ. 150 కోట్లు లంచం తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాల సీడీ తన దగ్గర ఉందని గాలి జనార్దన్ రెడ్డి గతంలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే.