సీఎం, మాజీ సీఎం ఆశీర్వాదం, బీజేపీ ర్యాలీలో గాలి జనార్దన్ రెడ్డి, అమిత్ షాకు ఝలక్!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గతంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మొదటిసారి బీజేపీ నాయకులతో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని అమిత్ షాకు, ఢిల్లీ పెద్దలకు ఝలక్ ఇచ్చారు.
ప్రాణ మిత్రుడు
గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ మిత్రుడు, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు శనివారం చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో నామినేషన్ వేశారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా హాజరైనారు.
సీఎం, మాజీ సీఎం
శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైనారు. యడ్యూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్ కు గాలి జనార్దన్ రెడ్డి ఎదురుగా వెళ్లారు.
పాదాబివందనం
బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిత్యం నవ్వుతూ ఉండే యడ్యూరప్ప గాలి జనార్దన్ రెడ్డిని చూసిన వెంటనే మరికొంచెం ఎక్కువగా నవ్వుతూ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప చాలా సేపు ఒకరి విషయాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ ర్యాలీలో గాలి
యడ్యూరప్పతో మాట్లాడిన తరువాత పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరువాత శ్రీరాములు నామినేషన్ సందర్బంగా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు.
అమిత్ షాకు ఝలక్
బీజేపీకి, గాలి జనార్దన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మైసూరులో ప్రకటించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్షంగానే బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ ర్యాలీలో పాల్గొన్ని ఢిల్లీ ఆ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.