లాలూ వర్సెస్ నితీష్: జనతా పరివార్లో వైరం, బీహార్పై బీజేపీ ధీమా
పాట్నా: బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా ఎదుర్కొనేందుకు ఒక్కటైన ఆరు పార్టీలు (జనతా పరివార్).. ఎంతో కాలం కలిసి ఉండలేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలీనం ప్రకటించి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు కనిపించలేదు.
జనతా పరివార్కు నేతగా సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ను ఎన్నుకున్నారు. కానీ, నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల పూర్తయ్యే వరకు ఉమ్మడి గుర్తు వద్దని ఎస్పీ నేత గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత నితీష్ కుమార్ల మధ్య వైరం కొనసాగుతోంది. మరోవైపు, ములాయం సింగ్ సారథ్యానికి దేవేగౌడ ససేమీరా అంటున్నారని తెలుస్తోంది.
నిన్నటి వరకు శత్రువులుగా ఉండి..
నిన్నటి వరకు శత్రువులుగా ఉండి.. కేవలం ప్రధాని మోడీని అడ్డుకుంటామని చెబుతూ జనతా పార్టీ మరోసారి తెర పైకి వచ్చింది. అయితే, నోటితో చెప్పినంత సులభంగా ఆచరణలో సాధ్యం కాదని మరోసారి తేటతెల్లమవుతోందని అంటున్నారు. కేవలం మోడీ కోసం ఒక్కటైనంత మాత్రాన.. కుదరదని అంటున్నారు.
బీహార్లో ఎన్నికల నేపథ్యంలో...
బీహార్ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ - అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న లాలీ, నితీశ్ మధ్య మరోసారి విభేదాలు కనిపిస్తున్నాయి. తన ప్రభుత్వంపై లాలూ పదేపదే విమర్శలు చేస్తుండటంతో.. నితీష్.. ములాయం సింగ్ తలుపు తట్టారు. కానీ ఆయన నుండి ఆశించిన స్పందన లేక నితీష్ షాక్ అయ్యారు.
జనతా పార్టీపై అనుమానాలు, ఎన్నో కారణాలు
జనతా పార్టీ విజయవంతం కాదని చెప్పేందుకు పలు కారణాలు ఉన్నాయంటున్నారు. గతంలో ఇవి విఫలమయ్యాయి. మాజీ ప్రధాని దేవేగౌడ.. ములాయం నేతృత్వంలో పని చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. హర్యానాలో ఐఎన్ఎల్డీ.. తమ ఎన్నికల చిహ్నం కళ్లజోడును వదులుకునేందుకు సిద్ధంగా లేదు.
ఆ మాటకు వస్తే సమాజ్ వాది పార్టీ తీరు కూడా అలాగే ఉంది. ముఖ్యంగా... బీహార్లో ఎన్నికల నేపథ్యంలో.. 243 సీట్లకు గాను తమకు 143 స్థానాలు కేటాయించాలని లాలూ పట్టుబడుతున్నారు. ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు జేడీయు సిద్ధంగా లేదు.
కాగా, 1988లో జనతాదళ్ను సామ్యవాద పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓటమి అనంతరం ఒక్కొక్క పార్టీ వేరు పడింది. సొంతగా ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసుకున్నాయి.
చాప్టర్ పూర్తి కాలేదు: నితీష్
జనతా పరివార్ విలీనం చాప్టర్ ముగిసిపోలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు.
బీహార్ పైన బీజేపీ ధీమా
బీహార్ ఎన్నికల్లో పోటీ కోసం నితీష్, లాలూల మధ్య దోస్తీ కుదరడం లేదని రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీహార్లో ఎన్డీయేదే విజయమని చెప్పారు.