రామజన్మభూమికి నేడు విముక్తి దినం... భవిష్యత్ తరాలకు స్పూర్తి.. అయోధ్యలో మోదీ స్పీచ్ హైలైట్స్...
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... కార్యక్రమ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జైశ్రీరామ్ నినాదాలతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ... అతిథులను కూడా జైశ్రీరామ్ నినాదాలు చేయాలని కోరారు. ఈ నినాదాలు కేవలం అయోధ్యలో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Recommended Video
రామజన్మభూమికి స్వేచ్చా దినం...
ఈ పుణ్య కార్యక్రమ సందర్భంగా భారతీయులకు, ప్రవాసులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. రామజన్మభూమికి ఇవాళ ఒక స్వేచ్చా దినం అని మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి ఎలాగైతే అగస్టు 15న స్వాతంత్య్రం లభించిందో... నేటి దినానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఉందన్నారు. రామ మందిరం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కోట్ల మంది భక్తుల జీవితాలకు దీన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చారిత్రక సందర్భంలో తాను భాగస్వామిని కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఇందుకు రామజన్మభూమి ట్రస్టుకు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.
రామ మందిరంతో పర్యాటక,ఆర్థిక అభివృద్ది...
రామ మందిరం కోసం కొన్ని తరాలు ఆశగా ఎదురుచూశాయని.. భారతీయ సాంస్కృతిక మూలాలు రాముడితో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అయోధ్యలో రాముడి గుడి ఒక చిన్న శిబిరం నుంచి నేడు భారీ మందిరం వరకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రక సందర్భంలో దేశమంతా ఐక్యంగా నిలిచిందన్నారు. రాముడు కేవలం భారతీయులనే కాదు,ప్రపంచాన్ని ఏకం చేస్తాడని అన్నారు. రాముడు మనందరి హృదయాల్లో,మదిలో నిలిచిపోయాడని చెప్పారు. రామ మందిర నిర్మాణంతో అయోధ్యలో పర్యాటక రంగం అభివృద్ది సాధిస్తుందని,తద్వారా ఆర్థిక పురోగతి జరుగుతుందని అన్నారు. రామ మందిర నిర్మాణ విషయంలో సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుంది....
'ఇన్నాళ్లు ఒక చిన్న శిబిరంలో ఉన్న మన రామ్ లల్లాకు ఇప్పుడో వైభోవేపతమైన ఆలయాన్ని నిర్మించబోతున్నాం. ఒకప్పటి విచ్ఛిన్నతను అధిగమించి ఈరోజు మళ్లీ రామ మందిరం నిర్మాణం జరుపుకోబోతుంది. ఇది శతాబ్దాల పాటు నిలిచిపోయే ఘట్టం.' అని మోదీ వ్యాఖ్యానించారు. రామ మందిరం మన సంప్రాదాయాలకు ఒక ఆధునిక చిహ్నంగా నిలుస్తుందన్నారు. మన మనోభావాలకు,భక్తికి ఇది చిహ్నంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు ఇది స్పూర్తినిస్తుందన్నారు.
అందరి సహాయ సహకారాలతో...
రామ మందిర నిర్మాణంతో చరిత్రను నిర్మించడమే కాదు.. పునరావృతమవుతోంది. రాముడికి గిరిజనులు సహాయం చేసినట్లుగా... శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తడానికి చిన్నపిల్లలు సహాయం చేసినట్లుగా... ఈనాడు అందరి సహాయ సహకారాలతో రామ మందిర నిర్మాణం జరుగుతోందన్నారు.'రాముడు సామాజిక సామరస్యాన్ని తన పాలనకు మూలస్తంభంగా మార్చుకున్నాడు.గురువు వశిష్టుడి నుంచి,మాతృమూర్తి లాంటి శబరి నుంచి అతను ఎంతో నేర్చుకున్నాడు. అలాగే హనుమంతుడు,వాన్వాసి సోదరులతో సహకారాన్ని పొందాడు. ఆఖరికి ఒక ఉడుత ప్రాముఖ్యతను కూడా విస్మరించలేదు.' అని మోదీ చెప్పుకొచ్చారు.