సీఎంను వెంటాడుతున్న అక్రమ మైనింగ్ కేసు, గాలి జనర్దాన్ రెడ్డి సాక్షాలు ? రూ. 150 కోట్లు లంచం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి, ఆయన భార్య జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామిని మళ్లీ జంతకల్ మైనింగ్ కంపెనీ కేసు వెంటాడుతోంది. కర్ణాటక హైకోర్టులో సీఎం కుమారస్వామి దంపతులు, ఈ కేసు నమోదు అయిన నాయకులు, అధికారులు విచారణ ఎదుర్కోవలసి ఉందని సమాచారం. కుమారస్వామి మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని కేసు నమోదు అయ్యింది.
దావణగెరె కార్యకర్త
కర్ణాటకలోని దావణగెరె జిల్లా, చెన్నగిరికి చెందిన సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ) సీఎం కుమారస్వామిగా ఉన్న సమయంలో జంతకల్ మైనింగ్ కంపెనీకి లాభం చేకూరేవిధంగా చర్యలు తీసుకున్నారని కోర్టును ఆశ్రయించారు. సీఎం కుమారస్వామితో పాటు న్యాయశాఖ కార్యదర్శి, లోకాయుక్త రిజిస్టార్ ను ప్రతివాదులుగా చేర్చి విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించాడు.
సీఎం భార్యకు లాభం
చిత్రదుర్గ జిల్లా హోళ్ళకెరెలో 2007-8-21 నుంచి 2009-2-14వరకు జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి జంతకల్ మైనింగ్ కంపెనీకి లాభం చేకూర్చాలని ప్రయత్నాలు చేశారని, అధికారులు వద్దంటున్నా జంతకల్ మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని, ప్రతిఫలంగా ఆ కంపెనీ వ్యవస్థాపకులు సీఎం కుమారస్వామి భార్య అనితా కుమారస్వామికి విశ్వభారతి హౌసింగ్ కో ఆపరేటివ్ సోసైటి నుంచి స్థలాలు మంజూరు చేశారని ఆర్ టీఐ కార్యకర్త అర్జీలో ఆరోపించారు.
రూ. 150 కోట్లు లంచం
కుమారస్వామి తదితరులు కోర్టు విచారణ నిలిపివేయాలని మనవి చెయ్యడంతో కేసు విచారణ నిలిపివేశారు. ఆర్ టీఐ కార్యకర్త సుప్రీం కోర్టును ఆశ్రయించడంతొ కేసు విచారణ మళ్ళీ మొదలైయ్యింది. గతంలో జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అప్పటి సీఎం కుమారస్వామి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి 2007లో బహిరంగంగా ఆరోపించారు. కుమారస్వామి లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ రెండుసార్లు విచారణకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి సాక్షాలను ఎస్ఐటీ అధికారులకు ఇచ్చామని అన్నారు.
కోర్టులో విచారణ ?
సీఎం కుమారస్వామి, అనితా కుమారస్వామి తదితరులు జంతకల్ మైనింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకో వ్యవహారంలో జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహరంలో నమోదు అయిన కేసులో గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు విచారణకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి సాక్షాలు తాము ఎస్ఐటీ అధికారులకు ఇచ్చామని మీడియాకు చెప్పి వెళ్లిపోయారు. హైకోర్టులో జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహారం విచారణకు రానున్న సమయంలో జేడీఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.