బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు: రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిధులు ఇవ్వమన్న జపాన్ సంస్థ
ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా కోరుతూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా బుల్లెట్ ట్రైన్కు నిధులను అందిస్తోన్న జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. నిధులు ఇవ్వాలంటే ముందుగా ఈ ప్రాజెక్టు ఏర్పాటులో రైతుల సమస్యలను పరిష్కరించాలని JICA తేల్చి చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించింది.
బుల్లెట్ ట్రైన్ కష్టాలు: ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ గుజరాత్ హైకోర్టులో రైతుల పిటిషన్
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం
అక్టోబర్ 1, 2003లో JICA ఏర్పాటైంది. ఇది జపాన్ ప్రభుత్వ సంస్థ. జపాన్ ప్రభుత్వం ఇతర దేశాలతో ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకుంటే అందులో భాగంగానే ఆదేశాలకు ఆర్థిక సహకారం అందిస్తుంది. తద్వారా అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య మైత్రి పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సామాజిక ఆర్ధిక అభివృద్ధికి సహకరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండేలా చూడటం JICA బాధ్యతగా తీసుకుంటుంది.
భూసేకరణలో విఫలమైన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్
ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును భారత్లో చేపడుతున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఇప్పటి వరకు గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాల్లో భూసేకరణ చేయడంలో విఫలమైంది. అక్కడి రైతులు తమ భూములుకు అధిక ధర చెల్లించాలని డిమాండ్ చేస్తుండటం, చెరువుల ఏర్పాటు, స్కూళ్లు, గ్రామాల్లో వైద్యులను ఏర్పాటు చేయాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు మొత్తం 508 కిలోమీటర్ల మేరా ట్రాక్ వేయాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు గుజరాత్లో 850 హెక్టార్ల భూమిని ఎనిమిది జిల్లాల్లో నివసిస్తున్న 5000 కుటుంబాల నుంచి సేకరించాల్సి ఉండగా వారుకూడా ఇందుకు సుముఖంగా లేరు.
రైతు సమస్యలు పరిష్కరిస్తేనే నిధులు: జపాన్ సంస్థ
భూసేకరణ క్రమంలో సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రైతులు లేఖ రాయడాన్ని JICA తీవ్రంగా పరిగణించింది. రైతు సమస్యలను తీర్చే వరకు లేద పరిష్కారం కనుగొనే వరకు నిధులను ఆపివేస్తున్నట్లు JICA పేర్కొంది. అంతేకాదు భారత్లోని జపాన్ దౌత్యవేత్త తమ భూములను వచ్చి స్వయంగా చూడాల్సిందిగా రైతులు కోరారు. ఇంత వివాదంలో కూడా ఇప్పటి వరకు జపాన్ సంస్థ రూ.125 కోట్లు నిధులను విడుదల చేసింది. మొత్తం లక్ష కోట్లు ఈ ప్రాజెక్టు అంచనా ఉండగా.. JICA రూ. 80వేల కోట్లు నిధులు అతి తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
రైతు సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో నీతిఆయోగ్ నుంచి సభ్యులు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి సీనియర్ అధికారులు, గుజరాత్ మహారాష్ట్ర నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు.