ఈశాన్యంలో మంటల వేడి: జపాన్ ప్రధాని పర్యటన వాయిదా: నిన్న బంగ్లా మంత్రుల టూర్ రద్దు..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆరంభమైన హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే వస్తున్నాయి. అయిదు రోజుల తరువాత కూడా అస్సాం, త్రిపురల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఈ పరిస్థితుల్లో- జపాన్ ప్రధానమంత్రి షింజో అబే.. తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ వెల్లడించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకు టీఎంసీ ఎంపీ, ఇవాళే విచారించండి, తోసిపుచ్చిన సీజేఐ
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్లీ..
పరిస్థితులు అనుకూలంగా మారిన తరువాత, రెండు దేశాలు పరస్పరం అంగీకరించిన తేదీల్లో షింజో అబే భారత పర్యటనకు వస్తారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అమలు చేసేలా పౌరసత్వ చట్టంలో మార్పులు చేస్తూ సవరించిన బిల్లును తొలుత లోక్ సభ, ఆ తరువాత రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి- అస్సాం, త్రిపురల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
బాహటంగా బంగ్లా నిరసన..
బంగ్లాదేశ్ ప్రభుత్వం సైతం పౌరసత్వ సవరణ చట్టం పట్ల నిరసనను వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తన భారత పర్యటనను రద్దు చేసుకుని, తన నిరసనను వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హోం శాఖ మంత్రి కూడా తన వ్యక్తిగత భారత పర్యటననురద్దు చేసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తన నిరసనను, వ్యతిరేకతను బాహటంగానే ప్రకటించినట్టయింది.
షింజో పర్యటన వాయిదాకు కారణాలివే..
24 గంటలు కూడా గడవక ముందే- జపాన్ ప్రధానమంత్రి షింజో అబే కూడా తన పర్యటనను వాయిదా వేసుకోవడం చర్చనీయాంశమైంది. షింజో పర్యటన వాయిదా పడటానికి కారణాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఆయన అస్సాంలోని గువాహటిలో పర్యటించాల్సి ఉంది. నరేంద్ర మోడీ-షింజో అబే మధ్య శిఖరాగ్ర సమావేశానికి గువాహటిని వేదికగా ఎంచుకున్నారు. అదే గువాహటిలో ప్రస్తుతం అల్లర్లు చెలరేగుతున్నందున.. షింజో భారత పర్యటన వాయిదా పడినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తోంది.