తాజ్మహల్ మెట్లు జపాన్ టూరిస్ట్ ప్రాణం తీశాయి
న్యూఢిల్లీ: 66 ఏళ్ల జపాన్ టూరిస్ట్ తాజ్ మహల్ మెట్ల మీద నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. తాజ్ గంజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జపాన్ దేశానికి చెందిన హెచ్. ఉయద అనే వ్యక్తి ముగ్గురు స్నేహితులతో కలిసి భారత్ సందర్శనకు వచ్చాడు.
గురువారం ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ సందర్శించిన అనంతరం యమునా నది తీరాన ఉన్న తాజ్ మహల్ను సందర్శించేందుకు వచ్చారు. మధ్యాహ్నా సమయంలో తాజ్ మహల్లోకి ప్రవేశించడానికి మెట్లు ఎక్కే క్రమంలో ఉయెద, అతని స్నేహితుడు మెట్లపై నుంచి జారి పడిపోయారు.
దీంతో తలకి తీవ్ర గాయం కావడంతో ఉయెద అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. తనతో పాటు మెట్లపై నుంచి కింద పడ్డ స్నేహితుడికి మాత్రం కాలు విరిగింది. అక్కడున్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.
దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సమీపంలోని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఉయెద మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి మృతికి అసలు కారణాన్ని వెతికే పనిలో పడ్డారు.
ఉయెద మృతి చెందిన విషయాన్ని జపాన్ దౌత్య కార్యాలయానికి సమాచారం అందించామని, మృతదేహాన్ని జపాన్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.