రాజస్థాన్లో బీజేపీకి మరో భారీ షాక్: కాంగ్రెస్లో చేరిన జశ్వంత్ సింగ్ తనయుడు
జైపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు, రాజస్థాన్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ తనయుడు మానవేంద్ర సింగ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే రాజస్థాన్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి.
కేబినెట్ మంత్రులు సహా 100 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్, నో టిక్కెట్
ఈ నేపథ్యంలో మానవేంద్ర సింగ్ కాంగ్రెస్లో చేరడం బీజేపీకి మరో పెద్ద దెబ్బ. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, రణదీప్ సుర్జేవాలాల సమక్షంలో పార్టీలో చేరారు.
తాను ఉదయం రాహుల్ గాంధీని కలిశానని, తాను పార్టీలో చేరడాన్ని ఆయన స్వాగతించారని, ఈ సమయంలో తన మద్దతుదారులు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తన వెంటే ఉంటారని నమ్ముతున్నానని చెప్పారు. మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్పుట్ల ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
మానవేంద్ర సింగ్ గతనెల 22న బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం తాను చేసిన పెద్ద తప్పన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మానవేంద్ర సింగ్ తండ్రి జశ్వంత్ సింగ్ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. వాజపేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణశాఖ, విదేశాంగశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
బీజేపీ తీరుపై అసహనంగా ఉన్న మానవేంద్ర గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజస్థాన్లో వసుంధర రాజే ప్రభుత్వ పదవీ కాలం ముగియనుండటంతో డిసెంబరులో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, మానవేంద్ర సింగ్ పార్టీ వీడటంపై రాజస్థాన్ మంత్రి రాజేంద్ర రాథోర్ స్పందించారు. ఆయన పార్టీ వీడటం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు.