రిజర్వేషన్ చిచ్చు: స్టేషన్కు నిప్పు, బస్సులు దగ్ధం సీఎం విజ్ఞప్తికి నో
రోహ్తక్: తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలో జాట్ కులస్తులు చేస్తున్న ఆందోలన తీవ్ర రూపం దాల్చింది. ఇందులో భాగంగా జింద్ జిల్లాలోని బుద్ధా ఖేర్ రైల్వే స్టేషన్కు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో స్టేషన్లోని ఫర్నీచర్, రికార్డు రూమ్, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
గత వారం రోజులుగా హర్యానాలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ కార్యాలయంతో పాటు హోటల్స్, పలు దుకాణాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అనంతరం రహదారులపై బైఠాయించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్భందించారు.
గుహానా రోడ్ లోని మూడు పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక్కడి పెట్రోలు బంక్ లు, కమ్యూనిటీ హాళ్లు, దుకాణాలను కూడా ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. కలనోర్ లో బీడీవో కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ప్రాంతంలో పలు బస్సులనూ దహనం చేశారు.
హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు కాలేజీల్లో విద్యార్థులుగా ఉన్న జాట్ వర్గీయులు రహదార్లపై నిరసన ప్రదర్శనలకు దిగారు. జింద్ జిల్లాలోని 30 ప్రాంతాల్లో రహదారులపై ఏ ఒక్క వాహనమూ కదిలే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఢిల్లీ-సోనిపట్ మార్గం పూర్తిగా మూసుకుపోగా, హర్యానా నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కాగా ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోహ్తక్, భివాని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్వర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు 3 వేల మంది కేంద్ర బలగాలను మోహరించింది. శనివారం ఉదయం కూడా పలు బస్సులను దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జాట్లు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేయడంతో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా హర్యానాకు చేరుకుంటుంది.
పోలీసులు, భద్రత బలగాలు, సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. గుర్గావ్ వెళ్లే రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను ఆందోళనకారులు దిగ్భందించారు. ఇదిలా ఉంటే ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి జరిపిన కాల్పుల్లో శుక్రవారం ఓ ఆందోళనకారుడు మృతి చెందాడు.
మరోవైపు ఓ ప్రైవేటు ఆయుధ కేంద్రంపై పడ్డ నిరసనకారులు తుపాకులను ఎత్తుకుపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కాగా, హర్యానాలో తాజా పరిణామాలపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
ఇదిలా ఉంటే హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్ కులస్తులు చేస్తున్న ఆందోళన కారణంగా ఆసుపత్రి వెళ్లలేక ఒక క్యాన్సర్ రోగి మృతి చెందారు. జింద్ జిల్లాలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆనంద్ మెదడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో నర్వాన్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న రోహ్తక్లోని వేరే ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అప్పటికే జాట్ల ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోగిని తరలించేందుకు ఎవరూ రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో రెండు గంటల తర్వాత ఆనంద్ పరిస్థితి మరింతగా విషమించి మృతి చెందినట్లు వివరించారు. రోగిని రోహ్తక్ తరలించి వెంటిలేటర్ సౌకర్యం కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శుక్రవారం నాడు రోహ్తక్లోని ఆర్ఎన్ మాల్పై దాడి చేసిన ఆందోళనకారులు దానికి నిప్పు పెట్టి, విలువైన వస్తువులను దోచుకుపోయారు.
ఆమోదిస్తా: ఖట్టర్, ఆర్డినెన్సు ఇస్తేనే విరమిస్తాం: జాట్లు
హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల గొడవ శనివారం నాడు కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం నాడు మరో ఐదుగురిని కాల్చి వేశారు. దీంతో ఈ ఉద్యమంలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు ఏడు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. పోలీసులు మరో ఐదు పట్టణాలలో కర్ఫ్యూ విధించారు.
జాట్ల ఉద్యమం ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖట్టార్ మాట్లాడుతూ.. మీ డిమాండ్లు ఆమోదిస్తామని, వెంటనే ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, అర్డినెన్స్ తెస్తేనే తాము ఆందోళన విరమిస్తామని జాట్లు వెల్లడించారు.