నెహ్రూ రికార్డు బద్దలుకొట్టిన మోడీ : ఎర్రకోటలో సుదీర్ఘ ప్రసంగం
న్యూఢిల్లీ : భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చేసిన ప్రసంగం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు మోడీ. నేటి ఉదయం ఎర్రకోట నుంచి చేసిన 94 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ద్వారా 1947 లో అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన 72 నిముషాల ప్రసంగాన్ని మోడీ బద్దలుకొట్టారు.
దేశ ప్రధానిగా ఎర్రకోట నుంచి చేసే ప్రసంగానికి ఏళ్లుగా ప్రాధాన్యమున్న సంగతి తెలిసిందే. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తూ.. ప్రధానులు చేసే ప్రసంగాల కోసం.. ఇటు ప్రజలు కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. దేశాభివ్రుద్ది కోసం కేంద్రం చేపడుతోన్న పథకాలను, వాటి పనితీరును, పురోగతిని వివరిస్తూ ప్రధానులు తమ ప్రసంగం కొనసాగించడం ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
తాజాగా ఇవే విషయాలను ప్రస్తావిస్తూ.. తన సుదీర్ఘ ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధాని మోడీ. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అవి ఎంతమేరకు అమలవతున్నాయి.. ఎన్నికల హామీల్లో లేకపోయినా కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలేమిటి? అన్న అంశాలతో కేంద్రం పనితీరుపై వివరణ ఇచ్చారు మోడీ. అలాగే ఉగ్రవాదంపై దాయాది దేశం పాక్ కు వైఖరిని తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేశారాయన.