కశ్మీర్లో అదృశ్యమైన జవాన్ కిడ్నాప్... ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అనుమానాలు...
జమ్మూకశ్మీర్లో ఆదివారం అదృశ్యమైన ఓ ఆర్మీ జవాన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం అతను అదృశ్యమవగా... సోమవారం కుల్గాం జిల్లాలో అతని కారును గుర్తించారు. అప్పటికే అది పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
'162వ బెటాలియన్(TA)కు చెందిన రైఫిల్మ్యాన్ షకీర్ మంజూర్ ఆదివారం నుంచి అదృశ్యమయ్యారు. సౌత్ కశ్మీర్లోని కుల్గాంలో అతని వాహనాన్ని దగ్ధమైన స్థితిలో గుర్తించాం.' అని ఆ ప్రతినిధి తెలిపారు. ఆ జవాన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉండవచ్చు అన్నారు.
Rifleman Shakir Manzoor of 162 Battalion (TA), is missing since 1700hrs yesterday. His abandoned burnt car has been found near #Kulgam. It is suspected that the soldier has been abducted by terrorists. Search op in progress.#TerrorismFreeKashmir #Kashmir@adgpi @NorthernComd_IA
— Chinar Corps - Indian Army (@ChinarcorpsIA) August 3, 2020
షకీర్ కుటుంబంతో కలిసి ఈద్ వేడుకలు జరుపుకునేందుకు సెలవుపై తన స్వగ్రామం రిషిపొరకి బయలుదేరినట్లు సమాచారం. అయితే మార్గమధ్యలోనే ముష్కరులు షకీర్ కారును అడ్డగించి అపహరించి అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సౌత్ కశ్మీర్లో గతంలోనూ ఉగ్రవాదులు పలువురు ఆర్మీ అధికారులను టార్గెట్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.