ఎంఎల్ఏ క్వాటర్స్ లో కాల్పులు, జవాను మృతి
ఇంఫాల్: మణిపూర్ లో దుండగుడు విరుచుకుపడ్డాడు. ఒక ప్రజా ప్రతినిధి ఇంటి దగ్గర విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో జవాను ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఇంఫాల్ లోని ఎంఎల్ఏ క్వార్టర్స్ ప్రాంగణంలో కాంగ్రెస్ శాసన సభ్యుడు కొరుంగ్ థాంగ్ నివాసం ఉంటున్నారు. ఈయన ఇంటి దగ్గర మణిపూర్ రైఫిల్స్ ఎనిమిదో బెటాలియన్ కు చెందిన హోప్ సన్ మారింగ్ (36) అనే జవాను విధులు నిర్వహిస్తున్నారు.
సోమవారం రాత్రి హోప్ సన్ ఎంఎల్ఏ ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యాడు. రాత్రి పోద్దు పోయిన తరువాత అక్కడికి వెళ్లిన దుండగుడు వెంట తీసుకు వెళ్లిన తుపాకి తీసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుండి పరారైనాడు.
బుల్లెట్ గాయాలైన హోప్ సన్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స విఫలమై అతను మరణించాడని పోలీసు అధికారులు అన్నారు. మృతదేహాన్ని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కు తరలించారు.
కాంగ్రెస్ శాసన సభ్యుడు కొరుంగ్ థాంగ్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారా, హోప్ సన్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. హత్య చేసి పరారైన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.