జయలలిత బంగ్లాలో రెండో సారి అగ్నిప్రమాదం: ఏం జరిగింది? కావాలనే నిప్పుపెట్టారా !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా ( గెస్ట్ హౌస్) లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. జయలలిత మరణించిన తరువాత రెండో సారి సిరుతాపూర్ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా ( గెస్ట్ హౌస్) లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
చెన్నై నగరానికి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో జయలతితకు చెందిన సిరుతాపూర్ బంగ్లా ఉంది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోనే నివాసం ఉండే జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం (విశ్రాంతి కోసం) మాత్రమే సిరుతాపూర్ బంగ్లాకు వెళ్లేవారు.
ఒక్క సారిగా మంటలు !
సోమవారం జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లాలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన అక్కడి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జయలలిత బంగ్లా నుంచి మంటలు వ్యాపించిన విషయం గుర్తించిన స్థానికులు అటు వైపు పరుగు శారు.
ఏం జరిగింది ?
జయలలిత బంగ్లా వైపు వెళ్లిన స్థానిక గ్రామస్తులు, పశువుల కాపరులు ఏం జరిగింది ? అంటూ ఆరా తియ్యడానికి ప్రయత్నించారు. అయితే సిరుతాపూర్ బంగ్లాలో పని చేస్తున్న సిబ్బంది స్థానికులను అడ్డుకున్నారు. స్థానికులకు వివరాలు చెప్పడానికి నిరాకరించారని తెలిసింది.
రెండో సారి అగ్నిప్రమాదం
జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లాలో రెండో సారి అగ్ని ప్రమాదం జరిగింది. జయలలిత మరణించిన తరువాత ఏప్రిల్ 19వ తేదీ సిరుతాపూర్ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. అప్పట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలు, విలువైన వస్తువులు బూడిద అయ్యాయని సమాచారం. సోమవారం (మే 29) మరో సారి అగ్ని ప్రమాదం జరిగింది.
ఆందోళనలో అమ్మ అభిమానులు !
జయలలిత మరణించిన తరువాత సిరుతాపూర్ బంగ్లా శశికళ కుటుంబ సభ్యుల చేతికి వెళ్లింది. శశికళ జైలుకు వెళ్లిన తరువాత టీటీవీ దినకరన్ ఆ బంగ్లా బాధ్యతలు సూచుకుంటున్నారు. దినకరన్ జైలుకు వెళ్లిన తరువాత సిరుతాపూర్ బంగ్లాను మన్నార్ గుడి మాఫియా సభ్యులు చూసుకుంటున్నారని సమాచారం.
బంగ్లా దగ్గర పోలీసులు !
సిరుతాపూర్ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది ? అనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.
కావాలనే నిప్పంటించారా ?
జయలలితకు చెందిన సిరుతాపూర్ బంగ్లాలో ఎవరైనా కావాలనే నిప్పంటించారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు. శశికళ కుటుంబ సభ్యుల ఆదీనంలో ఉన్న బంగ్లాలో ఎలా మంటలు వ్యాపించాయి ? అంటూ చర్చ మొదలు పెట్టారు.
ఇప్పుడు ఏమి బూడిద అయ్యింది ?
సిరుతాపూర్ బంగ్లాలో గత ఏప్రిల్ నెల 19వ తేదీ జరిగిన అగ్నిప్రమాదంలో జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలు బూడిద అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏమేమి బూడిద అయ్యాయి ? అనే విషయం వెలుగు చూడవలసి ఉంది.