నా ఫోటోలు తీస్తారా, భారతీయులం: జయకు కోపమొచ్చింది
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్కు కోపం వచ్చింది. మంగళవారం నాడు ముంబైలో జరిగిన ఓ కళాశాలలో ఓ ఈవెంటుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా అదే పనిగా ఫోటోలు తీస్తుండటంతో ఆమెకు ఆగ్రహం ముంచుకొచ్చింది.
జయాబచ్చన్ ప్రసంగిస్తుండగా అభిమానులు ఆమె మాటలు వినికుండా తమ ఫోన్లతో ఆమెను అదేపనిగా ఫోటోలు, వీడియోలు తీయడం చేశారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన జయాబచ్చన్.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు ఫోటోలు తీస్తుంటే, ఆ ఫ్లాష్ లైట్ నా కళ్లలో పడి ఇబ్బంది అవుతోందని, భారతీయుల మైన మనం ముందు నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ అని, మీ వద్ద కెమెరా, ఫోన్ ఉన్నంత మాత్రాన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరి ఫోటోలైనా తీయాలనుకోవడం సరికాదన్నారు.
పేరెంట్స్, టీచర్స్ పిల్లలకు మొదట క్రమశిక్షణ గురించి చెప్పాలన్నారు. నేను మాట్లాడుతుంటే ఎవరికి వారు ఫోటోలు తీయడం సరికాదని, నా అనుమతి లేకుండా ఫోటోలీ తీయవద్దని చెప్పేందుకు తనకు హక్కు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.