జయ మృతి: శశికళ, ‘అపోలో’ ప్రతాప్, ప్రీతారెడ్డిలకు సమన్లు జారీ
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నెచ్చెలి శశికళతోపాటు అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు పంపింది.
Recommended Video
అంతేగాక, 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, గత సంవత్సరం డిసెంబర్ 5న ప్రాణాలొదిలిన విషయం తెలిసిందే.
అప్పుడు వివరణ ఇచ్చారు కానీ..
కాగా, జయలలిత శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ ఛానెల్కు గతంలోనే వెల్లడించారు. మరోవైపు జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూడా చెప్పారు.
శశికళపైనే అనుమానాలు
ఇది ఇలావుంటే.. జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5 న అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు విడిచారు. కాగా, ఆమె మృతి వెనుక శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి.
విచారణ నేపథ్యంలో సమన్లు
అపోలో ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చినప్పటికీ జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె మాజీ సీఎం పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ కమిషన్... ఇందుకు సంబంధించి ఒక్కొక్కరినీ విచారణ చేస్తోంది. తాజాగా శశికళతో పాటుగా ప్రతాప్ రెడ్డి, ప్రీతారెడ్డికి సమన్లు ఇవ్వడం గమనార్హం.
జయ వీడియో కలకలం
తాజాగా, బుధవారం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అనూహ్యంగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో విడుదల కావడం సంచలనంగా మారింది. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియో విడుదల చేశారు. అయితే, తనకు తెలియకుండానే ఆ వీడియో విడుదల చేశారంటూ టీటీవీ దినకరన్ చెప్పారు. అంతేగాక, విచారణ కమిటీ కోరితే ఈ వీడియో ఇచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు.