జయ నర్సులకు బ్యూటీ టిప్స్ చెప్పారు: బెస్టీ టీకి ఇంటికి పిలిచారు
జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆమె తీరుపై ఆసక్తికరమైన కథనం వచ్చింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాదాపు 74 రోజులు అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె ఆస్పత్రిలో ఎలా గడిపారనే విషయంపై ఆసక్తికరమైన వార్తాకథనాలు వస్తున్నాయి. ఓ జాతీయ పత్రిక అత్యంత ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది.
జాతీయ పత్రిక కథనం ప్రకారం - ఆమె నర్సులతో జోక్లు వేస్తూ ఉండేవారని చెబుతున్నారు. నర్సులకు ఎంతో సహకరించారని కూడా అంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు కోపం వచ్చేదట. అమ్మను మూడు షిప్టుల్లో 16 మంది నర్సులు సేవలు చేస్తూ వచ్చారు.
వారిలో అమ్మకు ముగ్గురు నర్సులు బాగా నచ్చారట. వారు సివి షీల, ఎంవి రేణుక, శాముండేశ్వరి. వారిని ఆమె కింగ్ కాంగ్ అని పిలిచేదని అంటున్నారు. మీకేం కావాలో చెప్పండి, చేస్తా అనే జయలలిత తమతో చాలా సార్లు అన్నట్లు షీలా చెప్పారు.
చూడగానే జయ నవ్వేవారు..
తమను చూడగానే జయలలిత నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సార్లు తమకు సహకరిస్తూ వచ్చారని, తమ ఆమె వద్ద ఉన్నట్లు కష్టమైనప్పటికీ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించేవారని షీలా చెప్పారు.
ఆమెకు ఇష్టమైన వంటకాలు ఇవే...
పోయెస్ గార్డెన్లో కుక్ తనకు ఇష్టమైన వంటకాలు ఎలా చేసేవారో జయలలిత చెప్పినట్లు షీలా చెప్పారు. వాటిలో ఉప్మా, పొంగలు లేదా కర్డ్ రైస్, పొటాటో కర్రీ ఉండేవట. తాము ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించేవారని, అతి కష్టంగానైనా సరే తినడానికి ప్రయత్నించేవారని ఆమె చెప్పారు.
బ్యూటీ టిప్స్ ఇచ్చేవారట..
ఉల్లాసంగా ఉన్న సమయంలో నర్సులకు స్కిన్ కేర్ చిట్కాలు చెప్పేవారని అంటున్నారు. హెయిర్ స్టయిల్ మార్చుకోవాలని వారికి ఆదేశాలు కూడా ఇచ్చారట. ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే తమకోసం తాము కొంత సమయం కేటాయించుకోవాలని చెప్పేవారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యభామ చెప్పినట్లు జాతీయ పత్రిక రాసింది.
ఇంటికి విందుకు రావాలని చెప్పారు...
అస్పత్రి సిబ్బందికి ఎప్పుడూ గుర్తుండి పోయే జ్ఞాపకం కూడా ఉంది. తన ఇంటికి విందుకు రావాలని మెడికల్ టీమ్ అంతటినీ జయలలిత ఆహ్వానించారట. ఆమెకు అపోలోలో కాఫీ నచ్చలేదట. మా ఇంటికి రండి, కొడైనాడుకు చెందిన బెస్ట్ టీని మీకు ఇస్తాను అని చెప్పారని డాక్టర్ రమేష్ వెంకటరామన్ చెప్పినట్లు జాతీయ పత్రిక రాసింంది.