అమ్మ మరణ వార్తను తొలుత ప్రసారం చేసింది 'జయ టీవీ'యే..
జయలలిత టీవీ గ్రూప్కు చెందిన 'జయ ప్లస్' చానెల్ ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ తొలుత వార్తలు ప్రసారం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో సాయంత్రం 5.30గం.ల సమయంలో ఆమె మరణించిందన్న విషాద వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అమ్మ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అమ్మ మరణ వార్త తట్టుకోలేని కొంతమంది అభిమానులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టడంతో.. పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లుగా కనిపించాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అపోలో ఆసుపత్రి వర్గం మరణ వార్తలను ఖండించింది. జయలలితకు చికిత్స ఇంకా కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో.. పరిస్థితులు కొంచెం అదుపులోకి వచ్చాయి.
కాగా, జయలలిత మరణవార్తను మొదట ప్రసారం చేసింది జయకు చెందిన స్వంత టీవి చానెలే అన్న ఆరోపణలు వస్తున్నాయి.జయలలిత టీవీ గ్రూప్కు చెందిన 'జయ ప్లస్' చానెల్ ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ తొలుత వార్తలు ప్రసారం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మిగతా తమిళ చానెళ్లతో పాటు నేషనల్ మీడియా కూడా జయ మృతి వార్త నిజమేననుకుని ప్రసారం చేయడం మొదలుపెట్టాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జయలలిత మరణ వార్త ప్రసారం చేస్తున్నట్లుగా ఆరోపణలను జయ టీవి ఖండించడం గమనార్హం.