ఎన్ఆర్ఐ స్కాం కేసులో చిన్నమ్మ శశికళ మేనల్లుడు, జయా టీవీ సీఇవో, వీసీ, ఎఫ్ఐఆర్ !
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే. శశికళ కుటుంబ సభ్యుల మీద కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద కాలేజ్ లో సీటు తీసుకుని మోసం చేశారని ది డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఆంటీ కరప్షన్ (డీవీఏసీ) అధికారులు శశికళ మేనల్లుడు, జయా టీవీ 'సీఇవో, జాజ్ సినిమాస్ సీఇవో వివేక్ అలియాస్ వివేక్ జయరామన్ మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.
జయలలిత అధికారం
2015లో శశికళ మేనల్లుడు వివేక్ జయలలిత అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమిళనాడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా యూనివర్శిటీలో మూడు సంవత్సరాల న్యాయశాస్త్రం (ఎల్ఎల్ బీ) సీటును ఎన్ఆర్ఐ కోటాలో అక్రమంగా సంపాధించాడు.
ఎన్ఆర్ఐ కోటా సీటు
ఎన్ఆర్ఐ కోటా కింద సీటు సంపాధించాలంటే ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికెట్, ఎన్ఆర్ఐ పాస్ బుక్, కుటుంబ సభ్యుల నుంచి దృవీకరణ పత్రం, అర్హత సర్టిఫికెట్, లా కాలేజ్ లో చేరే విద్యార్థి అఫిడవిట్ తదితర సర్టిఫికెట్లు కచ్చితంగా సమర్పించాలి.
ఘరానామోసం
ఎన్ఆర్ఐలు విరాళాలు ఇచ్చి కాలేజ్ లో చేరినట్లు నకిలీ పత్రాలు సమర్పించిన వివేక్ డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్శిటీలో అక్రమంగా సీటు సంపాధించాడని డీవీఏసీ అధికారులు గుర్తించారు. వివేక్ కు యూనివర్శిటీలో సీటు ఎలా కేటాయించారు అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.
మాజీ వీసీ మీద కేసు
డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ పి. వనన్ గముది, వివేక్ మీద కేసు నమోదు చేసిన డీవీఏసీ అధికారులు ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఎన్ఐఆర్ స్కాం కేసులో వివేక్ పాత్ర ఎంత వరకు ఉంది, అతని కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా సహకరించారా ? అంటూ డీవీఏసీ అధికారులు ఆరా తీస్తున్నారు.