జయలలిత ఎదురించిన మేనకోడలు దీపా: ఎప్పుడంటే !
జయలలిత తనకు నామకరణం చేశారని, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు. మా అత్త ఆనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెతో కలిసి ఉండాలని చాల ప్రయత్నాలు చేశానని చెబుతున్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకు నామకరణం చేశారని, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు. మా అత్త ఆనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెతో కలిసి ఉండాలని చాల ప్రయత్నాలు చేశానని చెబుతున్నారు.
ఇటీవల ఓ ప్రవేటు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో జయలలిత సొంత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా ఈ విధంగా జరిగిన విషయాలు అన్నీ చెప్పారు. తాను 1974 దీపావళి ముందు రోజు జన్మించానని, అప్పుడు మా మేనత్త జయలలిత మా అమ్మా నాన్నల దగ్గరే ఉన్నారని అన్నారు.
జయలలిత నాకు దీపా అని నామకరణం చేశారని, దీపావళి ముందు రోజు జన్మించిన నా జీవితంలో వెలుగు ఉండాలని దీపా అని పేరు పెట్టారని గుర్తు చేశారు. మా మేనత్త జయ అంకితభావం, నిస్వార్థం, కష్టపడే తత్వం వంటి లక్షణాలు తనకు ఎంతో నచ్చాయని, ఆమె నా రోల్ మాడల్ అని దీపా చెప్పారు.
నా స్కూల్ డేస్ నుంచి మా మేనత్త సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని, ఆమె నాకు రోల్ మాడల్ అని అన్నారు. మేము పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోయిన తరువాత అక్కడికి కొత్త వాళ్లు వచ్చారు, మమల్ని దూరంగా పెట్టడానికి వారే కారణం అయ్యారని ఆరోపించారు.
1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆమె మా కుటుంబ సభ్యులు అందరితో కలిసి భోజనం చేశారని, మా నాన్న జయకుమార్ ను అందరికి పరిచయం చేస్తూ ఇతను నా సోదరుడు అని జయలలిత ప్రముఖులకు చెప్పారని గుర్తు చేశారు.
అప్పుడు నా వయస్సు 16 ఏళ్లు. నన్ను చూడగానే చాల సంతోషంగా నన్ను దగ్గరకు పిలిచి ఎలా ఉన్నావు, నీ చదువు ఎలా సాగుతుంది అని అడిగి తెలుసుకున్నారని దీపా చెప్పారు. తరువాత ముఖ్యమైన కార్యక్రమాలు అన్నింటికి మాకు ఆహ్వానం పంపించే వారని గుర్తు చేశారు.
అయితే మాకు రోజులు అనుకూలించలేదని చెప్పారు. మా నాన్న జయకుమార్ మరణించిన తరువాత జయలలిత మా ఇంటికి వచ్చి అందర్ని ఓదార్చారు. నాన్నతో కలిసి మా మేనత్త స్కూల్ కు వెళ్లిన రోజులు గుర్తు చేసుకున్నారని దీపా ఆవేదన చెందారు.
తరువాత మా మేనత్తతో మా కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయి. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని దీపా విచారం వ్యక్తం చేశారు. 1997లో జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో తాను వెళ్లి పరామర్శించానని అన్నారు.
ఆ సమయంలో నీవు చిన్నపిల్లవు, ఇలాంటి చోట్లకు రాకూడాదు అని జయలలిత తనతో అన్నారని, తానే జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కలుస్తానని చెప్పారని అన్నారు. తరువాత అనేక సార్లు మా మేనత్త జయలలితను కలవడానికి ప్రయత్నించినా అది వీలుకాలేదని దీపా అన్నారు.
2002లో రెండవ సారి మా మేనత్త జయలలిత సీఎం అయినప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి ఎందుకు మమ్మల్ని దూరంగా పెడుతున్నారు ? అని గట్టిగా గొడవ పెట్టుకున్నానని, ఆ సమయంలో నాకు నచ్చ చెప్పి దాదాపు ఆరు గంటల పాటు నాతోనే ఉన్నారని అన్నారు.
తరువాత తనకు చాల ముఖ్యమైన మీటింగ్ లు ఉన్నాయని, తరువాత కలుద్దామని, ఇప్పుడు ఇంటికి వెళ్లు అని చెప్పారని, తరువాత పోయెస్ గార్డెన్ లో ఉన్న కొందరు పెద్దల పుణ్యమా అంటూ మా కుటుంబ సభ్యులు జయలలితకు దూరం అయ్యారని దీపా ఆరోపించారు.