తమిళనాడు సీఎం ఆపీసుగా జయలలిత ఇల్లు- మద్రాస్ హైకోర్ట్ సంచలన సూచన...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్ధాపకురాలు జయలలిత గతంలో నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్ ఇంటిని ఆమె స్మారక చిహ్నంగా మార్చేందుకు పళనిస్వామి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్ట్ బ్రేక్ వేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ జారీతో పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను హైకోర్టు అడ్డుకుంది. దీనిపై జయలలిత వారసులు దీపక్, దీపా జయకుమార్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి ఓ సూచన చేసింది.
విలాసవంతమైన పోయెస్ గార్డెన్ ఇల్లు మొత్తాన్ని జయలలిత స్మారకంగా మార్చడం కంటే కొంత భాగాన్ని సీఎం కార్యాలయం, నివాసంగా వాడుకోవచ్చని మద్రాస్ హైకోర్ట్ సూచించింది. మిగతా భాగం స్మారకంగా మార్చుకోవచ్చని హైకోర్టు సూచించింది. దీంతో ఇప్పటివరకూ పోయెస్ గార్డెన్ ను జయలలిత స్మారకంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయిుంది.
పోయెస్ గార్డెన్ ఇంటిని ప్రభుత్వం భారీమొత్తం చెల్లించి కొనుగోలు చేసి జయలలిత స్మారకంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇలా ప్రైవేటు స్ధలాలను స్మారకాలుగా మార్చుకుంటే పోతే దీనికి అంతు లేకుండా పోతుందని హైకోర్టు పేర్కొంది. కాబట్టి జయలలిత వారసులైన దీపక్, దీపా జయకుమార్ పర్యవేక్షణలో కొంత మొత్తాన్ని చెల్లించి పోయెస్ గార్డెన్ ను వాడుకోవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంపై తమ స్పందన తేలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ కేసు తదుపరి విచారణను 8 వారాలు వాయిదా వేసింది.