జయలలిత సమాధే కళ్యాణ వేదికగా జరిగిన పెళ్లి .. అన్నాడీఎంకే నేతకున్న అభిమానమది
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై తమిళ ప్రజల అభిమానం అంతా ఇంతా కాదు. జయలలిత మరణం తో శోక సంద్రంలో మునిగిన తమిళ ప్రజలు ఆమె కోసం గుండెలవిసేలా రోదించారు. ఇది యావత్ దేశం కళ్ళారా చూసిన సంఘటన. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న జయలలితపై అక్కడి వారి అభిమానం ఆమె మరణించి ఇంత కాలం అవుతున్నా చెక్కుచెదరలేదు. అందుకు ఉదాహరణ అమ్మ సమాధి నే కళ్యాణ వేదికగా చేసుకుని జరిపించిన పెళ్లి ఘటన .
సాగర్ మహాస్తూపంపై కేసీఆర్ చిత్రం.. యాదాద్రి ఘటనతో తొలగింపు .. అక్కడ కూడా శిల్పిదే తప్పా !!
జయలలిత సమాధి వద్దే అన్నా డీఎంకే నేత కుమారుడి పెళ్లి
సాధారణంగా సమాధి అంటే శుభకార్యాలకు శుభసూచకంగా ఎవ్వరూ పరిగణించరు. అలాంటి సమాధిని శుభకార్యానికి వేదికగా చేసుకున్నారు. జయలలిత సమాధి సాక్ష్యంగా ఇద్దరు వధూవరులు దంపతులు అయ్యారు. అమ్మ పై అభిమానంతో ఆమెకు గుడి కట్టిన అన్నా డీఎంకే నేత ఎస్ భవానీశంకర్ తన కుమారుడు సాంబశివ రామన్ వివాహానికి జయలలిత సమాధి నే వేదికగా చేసుకున్నారు. సమాధి వద్ద వివాహమా అని ఎందరు ఎన్ని అన్నా సరే అమ్మను మించిన దైవం లేదని ఆయన తన కుమారుడి పెళ్లి సమాధి వద్దే జరిపించారు.
సమాధిని పూలతో అలంకరించి పెళ్లి వేదికగా మార్చి అట్టహాసంగా వివాహం
ఈ పెళ్లి కోసం జయలలిత సమాధి ని పూలతో చక్కగా అలంకరించారు. అమ్మ ఫోటో పెట్టి పూలమాల అలంకరించి అమ్మ కు ఎదురుగా పెళ్లి చేసి తన భక్తిని ప్ర దర్శించుకున్నాడు ఎస్ భవాని శంకర్ . అన్నా డీఎంకే నేత కుమారుడి కల్యాణం జయలలిత సమాధి సాక్షిగా అట్టహాసంగా జరిగింది. సాంబ శివరామన్, దీపికల వివాహానికి హాజరైన బంధుమిత్రులు జయలలిత పైన భవానీ శంకర్ కు ఉన్న అభిమానానికి ఆశ్చర్యపోయారు. ఇక ఈ పెళ్లిని చెన్నై బీచ్ లోని అమ్మ స్మారకస్థూపం సాక్షిగా వేదమంత్రాలతో సాంప్రదాయబద్దంగా జరిపించారు భవానీ శంకర్.
జయలలితపై అభిమానం చాటుకున్న నేత .. అమ్మ ఆశీర్వాదం కోసమే అక్కడ పెళ్లి అన్న భవానీ శంకర్
జయలలిత మరణించి 3 ఏళ్లు గడుస్తున్నా ఆమె ను అభిమానించే వాళ్ళు నేటికీ ఉన్నారు. ఆమె కోసం ఆవేదన చెందేవారు మాత్రమే కాదు, ఏ పని చేసిన అమ్మకు చెప్పి చేసే అభిమానులు సైతం నేటికీ ఉన్నారంటే ఆశ్చర్యం కాదు . ఆమె తమ మధ్య లేకపోయినా ఆమెను మరిచిపోలేనని, ఆమె జ్ఞాపకాలు నిత్యం మదిలో ఉంటాయని భవాని శంకర్ చెబుతున్నారు. అలాగే తన కొడుకు, కోడలికి అమ్మ ఆశీర్వాదం ఉండాలన్న ఉద్దేశంతోనే అమ్మ సమాధి వద్ద పెళ్లి జరిపిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇంతలో అభిమానించడం అంటే చాలా గొప్ప విషయమే అయినప్పటికీ, జయలలితకు అలాంటి అభిమానులు తమిళనాడు రాష్ట్రం నిండా ఉన్నారు అని చెప్పటం నిర్వివాదాంశం.