జయకు సుప్రీంలో చుక్కెదురు, 'అమ్మ సిమెంట్' పథకం
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి జయలలిత 'అమ్మ' పథకంలోకి 'అమ్మ సిమెంట్'ను తీసుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సిమెంట్ బస్దాను రూ. 190లకే అందించనున్నట్లు తెలిపారు.
పేద మద్య తరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం తక్కువ ధరకే సిమెంట్ బస్తా అందించాలనే ఉద్దేశ్యంతో జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకం కార్యరూపం దాల్చుతుందని ఆమె చెప్పారు.
ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రజలు 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటారో వారికి 50 సిమెంట్ బస్తాలు, 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేవారికి 750 సిమెంట్ బస్తాలు ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదలు, మధ్య తరగతి వాళ్ల కోసం అమ్మ పేరిట పథకాలను ప్రారంభించారు. అమ్మ క్యాంటిన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలు లాంటి పథకాలు ముఖ్యమైనవి.
జయలలిత ఆదాయానికి మంచి ఆస్తులున్నాయన్న కేసులో అంతిమ తీర్పు శనివారం వెలువడనుంది. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ చున్హా తీర్పును ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి జయలలిత పిటిషన్ తిరస్కరణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో తిరస్కరించింది. ఈ కేసులో రేపు (శనివారం) బెంగళూరు కోర్టు తుది తీర్పు వెల్లడించనుండగా, ఆ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. రూ.66 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 1996లో డీఎంకే దాఖలు చేసిన ఈ కేసు 18 సంవత్సరాల పాటు విచారించారు.