వెయ్యి కళ్లతో జయలలిత, అయోమయంలో సిద్దు టీం (వీడియో)
బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసు నుండి విముక్తి పోందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత మళ్లి సీఎం కుర్చీ ఎక్కడానికి సిద్దం అవుతున్నారు. శనివారం జయలలితకు పట్టాభిషేకం చెయ్యడానికి ఆ పార్టీ శాసన సభ్యులు అన్ని సిద్దం చేస్తున్నారు.
జయలలిత అక్రమ ఆస్తుల కేసు విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు జైలు శిక్ష విధించింది. అయితే కేసు అప్పీలుకు వెళ్లడంతో కర్ణాటక హై కోర్టులో విచారణ జరిగింది. కర్ణాటక హై కోర్టు ఏకసభ్య బెంచ్ కుమారి జయలలితకు క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టివేసింది.
కింది కోర్టు విధించిన శిక్ష, అపరాధ రుసుంను రద్దు చేసింది. ఈ కేసులో జయలలితతో పాటు అందరికి విముక్తి కలిగింది. సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని కర్ణాటక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య పట్టుబట్టారు. అయితే కర్ణాటక ప్రభుత్వం న్యాయనిపుణుల అభిప్రాయాలు అడిగింది.
గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం జరగవలసి ఉంది. అయితే గురువారం మద్యాహ్నం వరకు సమావేశం జరగలేదు. నాయకులు అందరూ గ్రామపంచాయితీ ఎన్నికలలో బిజీ బిజీగా ఉన్నారు.
కర్ణాటక ప్రభుత్వం గురువారం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని జయలలిత వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం చెన్నయ్ లో శాసన సభపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద జయలలిత భవిష్యత్తు ఆధారపడి ఉంది.