జయలలిత కేసు, అప్పీలు చెయ్యకుంటే అవమానమే
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని అడ్వకేట్ జనరల్ రవి వర్మ కుమార్ కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు. లేదంటే చివరికి ప్రభుత్వం తల దించుకునే పరిస్థితి వస్తుందని గుర్తు చేశారు.
అక్రమాస్తుల కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు ఏక సభ్య బెంచ్ జయలలిత, శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకర్ లను నిర్దోషులుగా ప్రకటిస్తు కేసు కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోలేదు.
సుప్రీం కోర్టులో అప్పీలు చేసే విషయంపై మంత్రి వర్గంతో చర్చిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు నిలబడదని అడ్వకేట్ జనరల్ రవి వర్మ కుమార్ అంటున్నారు.
ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే చివరికి తలదించుకునే పరిస్థితి ఎదురౌతుందని అంటున్నారు. ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లి తీర్పును ప్రశ్నిస్తే, సుప్రీం కోర్టులో తీర్పు వేరే విధంగా వస్తే అప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని న్యాయనిపుణలు అంటున్నారు.