శశికళ చేతుల్లోకి: అన్నాడీఎంకేపై సుబ్రమణ్య స్వామి సంచలనం
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి అన్నాడీఎంకేపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి అన్నాడీఎంకేపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కాగా, ఆ పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ చేతిలో పెడితే కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు. అంతేగాక, అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం వత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు.
పన్నీర్ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. సోమవారం రాత్రి జయలలిత కన్నుమూయడంతో పన్నీర్ సెల్వం తన మంత్రివర్గ సహచరులతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
గతంలో కూడా జయకు కోర్టు శిక్ష విధించిన కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆమెకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వం పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యతో సెప్టెంబర్ 22న జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా ఆయన ఆమెకు సంబంధించిన శాఖలను నిర్వహించారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆయనకే సీఎం పదవీ బాధ్యతలను అప్పగించడం జరిగింది.