జయలలిత మరణంతో.. ఒక్కరోజులోనే రూ.1500కోట్ల నష్టం
సీఎం జయలలిత మరణంతో.. తమిళనాట వాణిజ్య సముదాయాలన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం నాడు ఒక్కరోజే దాదాపు రూ.1500కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా.
చెన్నై: సీఎం జయలలిత మరణంతో తమిళనాట జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం పలు ప్రైవేటు రంగాలపై పడడంతో మంగళవారం ఒక్కనాడే తమిళనాడుకు దాదాపు 1500కోట్ల నష్టమేర వాటిల్లినట్టు సమాచారం.
సీఎం మరణానికి సంతాపంగా వాణిజ్య సముదాయాలు, పలు ఐటీ సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. ఇందులో ఆటో మొబైల్, ఐటీ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం.. ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీల మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ అన్ని తమిళనాడులో ఉండడమే.
దాదాపుగా ప్రతీ ఏటా 3.50 లక్షలకు పైగా కమర్షియల్ వెహికల్స్, 14 లక్షల కార్లు మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ నుంచే తయారవుతుంటాయి. అంటే, ప్రతి నిమిషానికి తమిళనాడులో మూడు కార్ల చొప్పున తయారవుతున్నాయి. మంగళవారం నాడు యూనిట్స్ అన్నింటిని మూసివేయడంతో ఆ నష్టం భారీగానే ఉంటుందని అంచనా.
ఇక ఐటీ రంగం విషయానికొస్తే.. తమిళనాడులో దాదాపుగా 600 ఐటీ కంపెనీలున్నాయి. ఇందులో 4లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. రీటెయిల్ సంస్థలో మంగళవారం నాడు ఒక్కరోజే దాదాపు రూ.200కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందనేది అంచనా. ఇలా మొత్తం అన్ని రంగాలను కలుపుకుని చూస్తే.. ఈ నష్టం దాదాపు రూ.1500కోట్ల వరకు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.