జయలలిత మృతి, శశికళకు షాక్, 2,956 పేజీల ప్రశ్నలు, 15 రోజులు టైం, అఫిడవిట్లు, జైల్లో!
చెన్నై/బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ కు షాక్ ఇచ్చారు. 2,956 పేజీల డాక్యూమెంట్లలో పలు ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పాలని శశికళకు ఆదేశాలు జారీ చేశారు.
అనుమానం
జయలలితకు నీడలాగ ఉన్న శశికళ ఆమెకు సరైన చికిత్స అందించలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూడటానికి ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదని అన్నాడీఎంకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
పన్నీర్ సెల్వం డిమాండ్
జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఎందుకు మమ్మల్ని చూడటానికి అవకాశం కల్పించలేదని, కేవలం శశికళ కుటుంబ సభ్యులు మాత్రమే అమ్మ దగ్గర ఎందుకు ఉన్నారని, ఈ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.
సీఎం పళనిస్వామి నిర్ణయం
జయలలిత మృతిపై వస్తున్న అనుమానాలు తొలగించడానికి మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఏకసభ్య కమిషన్ నియమించి విచారణ జరిపించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.
శశికళ ఫ్యామిలీ విచారణ
జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పటికే శశికళ కుటుంబ సభ్యులు వివేక్, క్రిష్ణప్రియ, దినకరన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ షీలా బాలక్రిష్ణన్, ప్రభుత్వ వైద్యుడు బాలాజీ, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు, జయలలిత వ్యక్తిగత కార్యదర్శి పొన్ గుండ్రన్, పొయెస్ గార్డెన్ లో పని చేసిన ఉద్యోగులు తదితరులను విచారణ చేసి వారు ఇచ్చిన సమాచారం రికార్డు చేశారు.
శశికళ రివర్స్
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను విచారణ చెయ్యాలని జనవరి నెలలో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అయితే తనను విచారణ చెయ్యాలని మీకు ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని, తమ న్యాయవాదులు వారిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలని శశికళ రివర్స్ అయ్యారు.
శశికళ డిమాండ్లు
శశికళ డిమాండ్లకు ఓకే చెప్పిన జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆమెను విచారణ చెయ్యాలని ఫిర్యాదు చేసిన వారి వివరాలు ఇచ్చి, ఆమె న్యాయవాదులు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శశికళను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
2,956 పేజీల ప్రశ్నలు
జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు 2,956 పేజీలలో పలు ప్రశ్నలు వేస్తూ 15 రోజుల్లో అఫిడవిట్లు దాఖలు చెయ్యాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళకు ఆదేశాలు జారీ చేసింది.