జయలలిత మృతి: శశికళ షరతులు, జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిటి ఓకే, సాక్షులు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిటీ వీకే. శశికళ నటరాజన్ షరతులకు ఓకే చెప్పింది. తనను విచారణ చెయ్యక ముందే తన న్యాయవాదులు తన మీద ఫిర్యాదు చేసిన వారిని విచారణ (క్రాస్ ఎగ్జామ్) చెయ్యాలని శశికళ షరతులు పెట్టడంతో జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అందుకు అంగీకరించింది.
ఎవరు ఫిర్యాదు చేశారు !
జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిటీ వీకే. శశికళ నటరాజన్ కు సమన్లు జారీ చేసి విచారణ చెయ్యాలని సూచించారు. అయితే శశికళ మాత్రం తనను విచారణ చెయ్యాలని మీకు ఎవరు ఫిర్యాదు చేశారు ? అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులు !
తన మీద ఎందుకు ఫిర్యాదు చేశారు అనే విషయం తెలుసుకోవడానికి మా న్యాయవాదులు తన మీద ఫిర్యాదు చేసిన వారిని, సాక్షులను విచారణ చేస్తారని, అందుకు మీరు అంగీకరించాలని శశికళ నటరాజన్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు షరతులు పెట్టారు.
ఓకే చెప్పిన జస్టిస్
మీ మీద ఫిర్యాదు చేసిన వారి వివరాలు ఇస్తామని, వారిని మీ న్యాయవాదులు విచారణ చెయ్యడానికి అనుమతి ఇస్తామని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అంగీకరించింది. శశికళను 15 రోజుల్లోపు విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది.
పెన్ డ్రైవ్, వీడియో !
జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు ఇప్పటికే శశికళ తన సమీప బంధువు టీటీవీ దినకరన్ తో ఒక పెన్ డ్రైవ్, జయలలితకు చికిత్స చేస్తున్న సమయంలో తీసిన వీడియోను అందించారు. పెన్ డ్రైవ్, వీడియోను పరిశీలించిన జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పుడు శశికళను విచారణ చెయ్యాలని నిర్ణయించారు.
జయ మేనకోడలు, మేనల్లుడు
జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ఇప్పటికే అనేక మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ చేసిన వారిలో జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ ఉన్నారు.
ప్రభుత్వ వైద్యులు
జయలలిత చికిత్స పర్యవేక్షణ బాధ్యతలు పర్యవేక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులతో ఓ కమిటీ నియమించింది. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు తాము చికిత్స చెయ్యలేదని, ఓ గదిలో కుర్చుని తాము చివరికి ఇంటికి వెళ్లేవాళ్లమని, జయలలితను ఒక్కసారి కూడా తాము ఆసుపత్రిలో చూడలేదని ప్రభుత్వ వైద్యులు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
శశికళకు ఇవే ప్రశ్నలు ?
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ వైద్యులకు ఎందుకు చూపించలేదు, అంత రహస్యంగా పెట్టవలసిన అవసరం ఏమిటి ? మీ బంధువులు మాత్రం ఎందుకు ఉన్నారు ? తదితర ప్రశ్నలను ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళను ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది.