జయలలిత ఇంటిలో ఏం జరిగిందంటే, వ్యక్తిగత వైద్యుడు, శశికళ సమీప బంధువు, విచారణ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు బుధవారం ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ హాజరైనారు. 2016 సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి పోయెస్ గార్డెన్ లో ఏం జరిగింది అనే పూర్తి సమాచారం డాక్టర్ శివకుమార్ వివరించారు.
Recommended Video
పోయెస్ గార్డెన్ లో
2016 సెప్టెంబర్ 22వ తేదీన పోయెస్ గార్డెన్ లో జయలలిత అస్వస్థతకు గురైనారని తనకు శశికళ ఫోన్ చేసి చెప్పారని, వెంటనే తాను అక్కడికి వెళ్లి ప్రథమ చికిత్స చేశానని డాక్టర్ శివకుమార్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు చెప్పారు.
అమ్మ జయలలిత
అమ్మ జయలలితకు ఆరోగ్యం కుదటపడకపోవడంతో తరువాత అపోలో ఆసుపత్రికి తరలించామని డాక్టర్ శివకుమార్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ ముందు వివరణ ఇచ్చారు. అనంతరం అపోలో, ఎయిమ్స్ డాక్టర్లు జయలలితకు చికిత్స చేశారని డాక్టర్ శివకుమార్ చెప్పారని తెలిసింది.
శశికళకు సమీప బంధువు
జయలలితకు చాలకాలంగా చివరి వరకూ వ్యక్తిగత వైద్యుడిగా పని చేసిన డాక్టర్ శివకుమార్ శశికళకు అత్యంత సమీప బంధువు. శశికళ బంధువు కావడంతో జయలలితకు వ్యక్తిగత వైద్యుడిగా డాక్టర్ శివకుమార్ ను నియమించారని, అపోలో ఆసుపత్రిలో చేరే వరకూ వేరే వైద్యుల దగ్గర ఆమెకు చికిత్స చేయించలేదని తెలిసింది.
మిడాస్ కంపెనీలో షేర్లు
వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ శివకుమార్ కు శశికళకు చెందిన మిడాస్ మద్యం కంపెనీలో భారీగా షేర్లు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ లో శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో డాక్టర్ శివకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు.
డాక్టర్ శివకుమార్ సాక్షం
డాక్టర్ శివకుమార్ సాక్షం జయలలిత అనుమానాస్పద మృతిపై జరుగుతున్న విచారణలో కీలకం కానుంది. ఎందుకంటే పోయెస్ గార్డెన్ లో డాక్టర్ శివకుమార్ మాత్రమే జయలలితకు చికిత్స చేశారు. జయలలిత ఆరోగ్యం గురించి డాక్టర్ శివకుమార్ కు పూర్తిగా తెలుసని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.