విజయకాంత్కు జయలలిత మరో షాక్: 'బర్త్ డే ఫోన్'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ నటుడు విజయకాంత్కు మరో షాకిచ్చారు. తద్వారా తమిళనాట పరువునష్టం దావాల వరద కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే మీడియా సంస్థలు, పాత్రికేయులు, వివిధ పార్టీల నేతలపై 200కు పైగా పరువు నష్టం దావాలు జయలలిత తరఫున దాఖలయ్యాయి. తాజాగా సోమవారం నాడు విజయ్కాంత్పై అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి దావా దాఖలు చేశారు.
జయలలిత తరఫున.. నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎమ్మెల్ జెగన్ సోమవారం నాడు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఎదుట పరువు నష్టం దావా దాఖలు చేశారు. విజయకాంత్ ప్రభుత్వం పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. చెన్నై వరదలు ఆర్టిఫిషియల్గా వచ్చాయని అవాస్తవ ప్రకటనలు చేస్తున్నారన్నారు. కాగా, ఇప్పటికే విజయకాంత్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జయ రెండు రోజుల క్రితమే షాకిచ్చారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్నాడిఎంకె శ్రేణులు పోటీపడుతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 24) జయలలిత 68వ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విదేశాల్లో ఉన్నవారు జయకునేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం పార్టీలోని ఐటీ విభాగం రెండు ప్రత్యేక ఫోన్ లైన్లను ఏర్పాటు చేసింది. ఆ నెంబర్లకు అభిమానులు ఫోన్ చేసి 30 సెకన్ల పాటు తమ శుభాకాంక్షల సందేశం చెప్పొచ్చు.