అందువల్లే జయలలిత వేలిముద్ర వేశారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రికి ప్రస్తుతం ఫిజియో థెరపీ చికిత్స అందిస్తున్నారని, అందు వలనే ఆమె బీ-ఫామ్స్ లో సంతకాలు చెయ్యలేకపోయారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ అన్నారు.
తమిళనాడులోని మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల సందర్బంగా అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇచ్చిన సమయంలో జయలలిత సంతకంకు బదులుగా వేలిముద్రలు వేసిన విషయం తెలిసిందే. వేలిముద్రలు ఉండటంతో ఎన్నికల అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదు.
ప్రభుత్వ వైద్యులు సహా జయలలిత వేలిముద్రలపై దృవీకరణ పత్రం ఇచ్చారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ గుర్తు చేశారు. అయితే కొంత మంది నాయకులు కుళ్లు రాజకీయలు చెయ్యడానికి ఈ విషయంలో రాద్దాంతం చేస్తున్నారని రామచంద్రన్ మండిపడ్డారు.
జయలలిత ఆరోగ్యంపై పుకార్లు నమ్మరాదని ఆయన కార్యకర్తలకు మనవి చేశారు. అమ్మ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చెయ్యడానికి వస్తారని రామచంద్రన్ అన్నారు. అమ్మ కోసం ప్రజలు, పార్టీ కార్యకర్తలు చేసిన పూజలు ఫలించాయని అన్నాడీఎంకే నాయకుడు రామచంద్రన్ అన్నారు.