అమ్మ పెద్ద మనసు: వీధుల్లో బిచ్చగత్తెను లాయర్ చేసింది
మైసూరు వీధుల్లో భిక్షాటన చేసుకునే స్థాయి నుంచి నేడు ఓ సామాజిక బాధ్యత కలిగిన న్యాయవాదిగా నాగరత్న(32) ఎదగడం వెనుక జయ అందించిన ఆపన్న హస్తం ఉంది.
చెన్నై: అమ్మ అస్తమయం తమిళ జనాలను శోకసంద్రంలో ముంచింది. జయ ఇక లేరన్న మరణవార్తను జీర్ణించుకోలేక ఆమె అభిమానులు తల్లడిల్లిన తీరు వర్ణనాతీతం. తన జీవితంలో భార్య స్థానాన్ని పొందలేకపోయిన జయ.. తమిళ ప్రజలకు మాత్రం అమ్మగా మారి చరిత్రలో నిలిచిపోయారు.
తమిళనాట ప్రతీ ఇల్లు ఆమెను అమ్మ అని ఆదరించిందంటే.. అక్కడి జనం గుండెల్లోకి ఆమె ఎంతగా చొచ్చుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. తమిళ జనం జయను తమ సొంత మనిషిగా భావించడం వెనుక.. ఆమె చేసిన కొన్ని సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కష్టాల్లో ఉన్న పేదజనం పట్ల ఆమె స్పందించిన తీరు అక్కడి జనానికి ఆమెను మరింత దగ్గరచేసింది.
అమ్మ సేవాగుణానికి నాగరత్న అనే ఓ లాయర్ జీవితాన్ని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మైసూరు వీధుల్లో భిక్షాటన చేసుకునే స్థాయి నుంచి నేడు ఓ సామాజిక బాధ్యత కలిగిన న్యాయవాదిగా నాగరత్న(32) ఎదగడం వెనుక జయ అందించిన ఆపన్న హస్తం ఉంది.
చదువంటే అమితమైన ఆసక్తిని కనబరిచే నాగరత్నకు తల్లిదండ్రుల ఆర్థికస్థితి ఏమాత్రం సహకరించలేదు. దీంతో స్కూల్ కు వెళ్తూనే.. ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో కలిసి భిక్షాటనకు వెళ్లేది.2001లో 65శాతం మార్కులతో పదవతరగతి పాసైంది. అప్పటికీ ఓ సొంత గూడంటూ ఏదీ లేదు. వీధి లైట్ల కిందే చదుకోవడం.. అక్కడే నిద్రపోవడం.
ఈ నేపథ్యంలోనే ఆమె ధీనావస్థను గమనించిన ఎక్స్ప్రెస్ దినపత్రిక ఆమెపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో విషయం కాస్త జయలలిత దృష్టికి వెళ్లింది. వెంటనే కర్ణాటకలోని పార్టీ నేత వి.పుగజెందికి ఫోన్ చేసి ఆమెకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆదేశించారు. అమ్మ ఆదేశంతో పుగజెంది మైసూరులోని కొన్ని వీధుల్లో ఆమె కోసం వెతికారు.
మొత్తానికి నాగరత్నను కలిసి అసలు విషయం చెప్పడంతో.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఆరోజు సాయంత్రానికి జయలలిత అపాయింట్ మెంట్ ఇవ్వడంతో.. పుగజెందితో కలిసి జయలలిత ఉన్న పాండ్యన్ హోటల్ కు నాగరత్న వెళ్లింది. సీఎం వద్దకు వెళ్లగానే తన పరిస్థితి గురించి వివరించి ఆవేదన వ్యక్తం చేసింది.
నాగరత్న కష్టాలను పెద్ద మనసుతో అర్థం చేసుకున్న జయలలిత తక్షణం లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందజేశారు. అమ్మ చేసిన సహాయానికి నాగరత్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో నాగరత్న కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ముందుకెళ్లాల్సిందిగా జయలలిత ఆమెకు భరోసా ఇచ్చారు.
అమ్మ అందించిన చేయూతతో ఎల్.ఎల్.బి పూర్తి చేసిన నాగరత్న ప్రస్తుతం సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. భిక్షాటన దశ నుంచి కోర్టులో లాయర్ దాకా సాగిన తన ప్రయాణంలో అమ్మ అందించిన సహాయం మరువలేనిది అని నాగరత్న చెబుతోంది. అమ్మను కలవాలని అనునకుంటున్న తరుణంలోనే.. ఆమె మరణవార్త వినాల్సి రావడం జీర్ణించుకోలేకపోతున్నానని నాగరత్న కన్నీటిపర్యంతమైంది. నాగరత్న లాగానే మరికొంతమందికి కూడా జయ ఆపన్న హస్తం అందించి ఉండవచ్చు. వారంతా ఇప్పుడు అమ్మ తమకు చేసిన సహాయాల్ని గుర్తుచేస్తుకుంటూ ఆవేదన చెందుతున్నారు.