జయలలిత ఆరోగ్యం ఓకే: అపోలో, కానీ !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడిందని, ఆమె వందశాతం ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.
శుక్రవారం డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జయలలిత ఆరోగ్యం విషయంపై క్లారిటీ ఇచ్చారు. జయలలిత చాల రోజుల నుంచి ఐసీయులో చికిత్స పొందుతున్నారని అన్నారు.
ఆమెకు సోకిన ఇన్ ఫెక్షన్ పూర్తిగా నయం అయ్యిందని చెప్పారు. అయితే ప్రస్తుతం జయలలిత ఐసీయులోనే ఉన్నారని వివరించారు. వేరే వార్డుకు ఆమెను మార్చితే మళ్లీ ఇన్ ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని భావించి తాము ఐసీయులోనే పెట్టామని అన్నారు.
జయలలిత ఎప్పటిలాగే అందరితో మాట్లాడుతున్నారని, ఆమె తన శ్రేయోభిలాషులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. ప్రస్తుతం జయలలిత విశ్రాంతి మాత్రం తీసుకుంటున్నారని అన్నారు. .
జయలలిత ఎప్పుడు ఓకే అంటే అప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. అయితే డిశ్చార్జ్ అయ్యే విషయంపై జయలలితనే నిర్ణయం తీసుకుంటారని, అమె ఇష్ట ప్రకారం తాము డిశ్చార్జ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మూడో సారి అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో అమ్మ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో అన్నాడీఎంకే వర్గాలు, పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.