కొడుకుల ఎత్తుపైఎత్తు: కరుణకు 'సన్' స్ట్రోక్, అదే ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రినని, తన అనంతరమే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని కరుణానిధి కొద్ది రోజుల క్రితం చెప్పారు. కానీ ముఖ్యమంత్రి అవుదాముకున్న కురువృద్ధుడి కోరిక నెరవేరలేదు.
ఇందుకు పలు కారణాలతో పాటు.. తనయులు అళగిరి, స్టాలిన్ కూడా ఆయన కొంపముంచారు. జయలలిత గెలుపుకు పలు కారణాలు ఉన్నాయి. అలాగే కరుణ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కొడుకుల మధ్య విభేదాలు ఓ కారణం.
తమిళ ఎన్నికల్లో తమదే గెలుపునని నిన్నటి దాకా డీఎంకే వర్గాలు సంతోషంగా ఉన్నాయి. అదే సమయంలో సర్వేలు చూసిన జయలలిత వర్గాలు నిరాశలో ఉండిపోయాయి. కానీ ఫలితాల తర్వాత రివర్స్ అయింది. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఆనందాలు, డీఎంకే కార్యాలయం వద్ద నిస్తేజం కనిపిస్తోంది.
కరుణానిధి కొంప ముంచడంలో తనయుల పాత్ర కూడా ఉందని డీఎంకే కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ఎన్నికల పోరును వదిలేశారంటున్నారు. పార్టీలో కుమ్ములాటలు తీవ్రతరమవడంతో ఆళగిరిని సస్పెండ్ చేసి.. ఆ తర్వాత ఎన్నికల కోసం దగ్గరకు తీసుకున్నా ఫలితం లేకపోయింది.
పార్టీలోకి వచ్చిన తర్వాత తన వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం ఆళగిరి పెద్ద పోరాటమే చేశారు. అయినా పార్టీలో స్టాలిన్ ఆధిపత్యం ఉండటంతో ఆళగిరికి కోపం వచ్చింది. తమ వారికి సీట్లు దక్కకపోవడంతో దక్షిణ తమిళనాడులో అసలు డీఎంకేనే గెలవకూడదంటూ ఆళగిరి తమవారిని ఉసిగొల్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాను ఉన్నంత వరకూ పార్టీ తరపున ముఖ్యమంత్రి తానేనంటూ కరుణానిధి స్పష్టం చేసినా స్టాలిన్, ఆళగిరి వారసత్వం కోసం.. పార్టీలో పైచేయి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చివరికి చిత్తయ్యారు. అసలు ఆళగిరిని పార్టీలోకి తీసుకోకుండా ఉంటేనే బాగుండేదని స్టాలిన్ వర్గం అంటోంది.
పార్టీని ఓటమిపాలు చేయడానికే అళగిరి వచ్చారని, అనుకున్నది సాధించారని మండిపడుతున్నారు. గతంలో పార్టీలో పెత్తనం చెలాయించిన కరుణ కూతురు కనిమొళి.. 2జీ స్పెక్ట్రమ్ కేసు వల్ల ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె ఎక్కడా ఎక్కువగా కనిపించలేదు.
తాను చనిపోయేలోపు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కలను కుమారులిద్దరూ కలిసి విజయవంతంగా కల్లలు చేశారని కరుణానిధి ఆవేదన చెందుతున్నారు. అయితే గతంలో కంటే సీట్లు పెరగడం కరుణానిధికి కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.
గతంలో పార్టీ వారసత్వం ఎవరికి దక్కాలనే అంశంపై గతంలో కరుణానిధి మనువళ్లు దయానిధి మారన్, కళానిధి మారన్ సొంత పత్రిక దినకరణ్ చేసిన సర్వేలో స్టాలిన్ మద్దతుగా ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసింది. 70 శాతం మంది స్టాలిన్ వైపే మొగ్గు చూపారని తేల్చింది.
ఈ సర్వే డీఎంకేను కుదిపేసింది. పార్టీలో ఆళగిరి వర్గీయులు రభస చేశారు. పత్రిక కార్యాలయంపై బాంబులు కూడా వేశారు. ఈ ఘటనే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ నుంచి దూరమవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆళగిరి సస్పెండ్ చేశారు. ఎన్నికల ముందు తండ్రీ కొడుకుల మధ్య మాటలు కలిశాయి. కానీ ఆధిపత్య పోరు వల్ల కరుణానిధి కల నెరవేరకుండా పోయింది.