అపోలో అరిపించింది: దివంగత సీఎం జయలలిత హాస్పిటల్ ఖర్చు ఎంతో తెలుసా..?
Recommended Video
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత హాస్పిటల్లో అడ్మిట్ అయిన నాటి నుంచి చనిపోయేవరకు ఆమె చికిత్సకు, తీసుకున్న ఆహారం ఖర్చు బిల్లు భారీగానే అయ్యింది. ఆమె మృతి మిస్టరీగా ఉండటంతో ఆ మిస్టరీని చేధించే క్రమంలో విచారణాధికారులకు జయలలిత హాస్పిటల్ ఖర్చు వివరాలు అందాయి. ప్రస్తుతం ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
75 రోజుల ట్రీట్మెంట్కు కోట్లలో బిల్లు
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 సెప్టెంబరులో తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. మొత్తం 75 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. అయితే ఆ సమయంలో జయలలిత పై అయిన మొత్తం ఖర్చు రూ. 6.85 కోట్లు. దీంతో పాటు ఓట్ స్టాండింగ్ అమౌంట్ రూ.44.56 లక్షలు అయ్యింది. డిసెంబర్ 5, 2016న జయలలిత మృతి చెందిన తర్వాత జూన్ 15, 2017లో ఆమె చికిత్స కోసం రూ. 6 కోట్లు ఆస్పత్రి వర్గాలకు చెల్లించినట్లు అన్నాడీఎంకే ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 13, 2016న రూ.41.13 లక్షలు చెల్లించినట్లుగా రశీదులో ఉంది. అయితే అది ఎవరు చెల్లించారనేదానిపై స్పష్టత లేదు.
బిల్లు ఎలా లీక్ అయ్యింది..?
బిల్లు లీక్ ఎలా అయిందనే విషయంపై కేసు విచారణ చేస్తున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ ఆరా తీయగా అది బయటకు వెల్లడించలేమని హాస్పిటల్ లీగల్ ప్యానెల్ తెలిపింది. అయితే ఆస్పత్రికి చెల్లించిన బిల్లు నిజమే అని మాత్రమే స్పష్టం చేసింది. అంతేకాదు నవంబర్ 27, 2018న విచారణ కమిషన్కు సబ్మిట్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హాస్పిటల్ బిల్లుకు సంబంధించి మొత్తం వివరాలు 200 పేజీలలో సమర్పించిందని అయితే కమిషన్ రహస్యంగా ఉంచాల్సిన బిల్లు ఎలా బయటకొచ్చిందో తెలియడం లేదని హాస్పిటల్ కౌన్సిల్ మైమూనా బాద్షా అన్నారు.
అమ్మ ఆహారం కింద రూ.1.17 కోట్లు బిల్లు
"ఫుడ్ అండ్ బెవరేజెస్" హెడ్డింగ్ కింద బిల్లు రూ.1,17,04,925 రూపాయలు వచ్చిందని.. అందులో జయలలితను చూసేందుకు వచ్చిన వారికి అందించిన ఆహారం వివరాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇక కన్సల్టేషన్ ఫీజు రూ. 71 లక్షలు అయ్యిందని ఉంది. ఇక అమ్మకు చికిత్స అందించేందుకు యూకే నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బేలేకు రూ. 92 లక్షలు చెల్లించగా..సింగపూర్ నుంచి వచ్చిన వారికి రూ. 1.29 కోట్లు చెల్లించినట్లు బ్రేకప్ బిల్లులో ఉంది. ఇక జయలలిత బస చేసిన గది ఖర్చు రూ. 1.24 కోట్లుగా తేల్చింది.
జయలలిత 22 సెప్టెంబర్ 2016లో అనారోగ్యంతో అపోలో హాస్పిటల్లో చేరారు. మొత్తం 75 రోజుల పాటు చికిత్స అనంతరం 5 డిసెంబరు 2016లో మృతి చెందారు. జయలలిత మృతిపై పలు అనుమానాలు తలెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 2017లో విచారణ చేయాల్సిందిగా కమిటీ వేసింది. జయలలిత మృతికి దారితీసిన కారణాలను విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆమె హాస్పిటల్లో చేరిననాటి నుంచి చనిపోయేవరకు జరిగిన ట్రీట్మెంట్ ఇతరత్ర అంశాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా తమిళ సర్కార్ కమిటీని ఆదేశించింది.